భారత కొత్త సీజేఐగా సూర్యకాంత్ – గవాయ్ సిఫార్సు ఫైనల్!
న్యాయమూర్తుల నియామకం, బదిలీ, పదోన్నతి విధానాలను పేర్కొనే ‘మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్’ (MoP) ప్రకారం, సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్ జడ్జీని సీజేఐగా నియమించడం భారత న్యాయవ్యవస్థలో సుదీర్ఘకాలంగా వస్తున్న సాంప్రదాయం. జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయనకు సీజేఐగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం (సుమారు 15 నెలలు) పదవీకాలం లభించనుంది. ఆయన పదవీ విరమణ తేదీ 2027 ఫిబ్రవరి 9వ తేదీ. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు అరవై ఐదేళ్లు.
1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్, రెండు దశాబ్దాలుగా న్యాయవ్యవస్థలో విశేష సేవలందిస్తున్నారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఆయన ఆర్టికల్ 370 రద్దు, స్వేచ్ఛా హక్కులు, అవినీతి నిరోధం, పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం వంటి అనేక కీలక అంశాలపై పలు చారిత్రక తీర్పులు వెలువరించారు. న్యాయ వ్యవస్థలో నిబద్ధత, నిష్పక్షపాత వైఖరి కలిగిన జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వంలో, దేశ అత్యున్నత న్యాయస్థానం మరింత కీలకంగా, చురుకుగా పనిచేస్తుందని న్యాయ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (