రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గురించి చర్చించుకుంటున్నారు. ఓ నలుగురు వ్యక్తులు ఒక దగ్గర కలిశారు అంటే జూబ్లీహిల్స్ గురించే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక అనేది మూడు ప్రధాన పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు పైనే ఆధారపడి వారి భవిష్యత్తు ఉంటుంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక రావడానికి కారణం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం.. అయితే బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ భార్య మాగంటి సునీత నే పోటీ చేస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి లోకల్ కాండిడేట్ నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బిజెపి నుంచి లంకల దీపక్ రెడ్డిని ఫైనల్ చేశారు. ఇదే తరుణంలో ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. కానీ ప్రధానంగా పోటీ అనేది బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్యే ఉంటుందని అంటున్నారు. అయితే బిజెపి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పెద్దగా ప్రచారంలో హోరు చూపించడం లేదని అర్థమవుతుంది.
ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ముందుకు వెళుతున్నాయి. అలాంటి ఈ సమయంలో బిజెపి పార్టీ కనీసం ఎన్నికలన్నా కాకముందే వారి ఓటమిని ఒప్పేసుకున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఒక విషయాన్ని బయటపెట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. గెలుపు వచ్చిందని విర్రవీగకూడదు, ఓటమి వచ్చినది బాధపడకూడదు అనే విధంగా మాట్లాడారు. కానీ అక్కడ బిజెపి గెలుస్తుందని బలంగా అయితే చెప్పలేదు. దీన్ని బట్టి చూస్తే బిజెపి కన్ఫామ్ గా ఓటమిపాలవుతుందని రామచందర్ రావు ముందే గ్రహించినట్టు ఉన్నారు.
ఇక రెండవది బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీతను పెట్టి సింపతి రాజకీయం చేస్తుందని చాలామంది భావిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది సునీతకు రాజకీయ అనుభవం లేదు. అంతేకాకుండా లోకల్ క్యాండిడేట్ కాదు.. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆమెకు కూడా పెద్దగా మద్దతు వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక నవీన్ యాదవ్ విషయానికొస్తే యంగ్ నాయకుడు, లోకల్ క్యాండిడేట్, ఇప్పటికే ఎంఐఎం పార్టీతో మంచి బంధాన్ని ఏర్పరచుకొని ఆ ఓటర్లను పూర్తిగా తనవైపు తిప్పుకునే శక్తి ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయనకు అన్ని విధాల సపోర్టు లభిస్తుంది. ఈ అంశాలన్నీ గమనిస్తే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.