కొండా సురేఖ‌తో రేవంత్‌కు మ‌రిన్ని త‌ల‌నొప్పులు... ప‌రిస్థితి చేయి దాటిపోతోందా..?

RAMAKRISHNA S.S.
రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ తీరుతో రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు కొత్త చిక్కులు తప్పడం లేదు. ఇప్పటివరకు అక్కినేని నాగార్జున - సమంత - కేటీఆర్ - నాగచైతన్య విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పార్టీకి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే . నాగచైతన్య సమంత విడాకుల విషయంలోకి కేటీఆర్ ను లాగిన సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ మొత్తం భ‌గ్గుమంది. ఈ వివాదం నుంచి ఇప్పుడిప్పుడే కాస్త అందరూ మర్చిపోతున్న సమయంలో ఇప్పుడు కొండా సురేఖ వరంగల్ జిల్లాల వర్గపోరుకు తెర లేపారు. మంత్రి కొండా సురేఖ - పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య ఇప్పటికే గొడవలు నడుస్తున్నాయి. సురేఖ ఒకప్పుడు పరకాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే పరకాల నియోజకవర్గంలో తన అనుచరులను ఎంకరేజ్ చేస్తూ వస్తున్న సురేఖ అక్కడ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా గ్రూపు రాజకీయ ప్రోత్సహిస్తున్నారు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలోని ధర్మారంలో మంత్రి కొండా వర్గీయులు ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో రేవూరి ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు వాటిని చింపి ధ్వంసం చేసి ప‌డేశారు. స‌హ‌జంగానే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ అభిమాన నేత మంత్రి కొండా ఫ్లెక్సీలు చింపివేయడంపై ఆమె అభిమానులు పెద్దఎత్తున నిరసన చేప‌ట్టడంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డింది. సురేఖ వ‌ర్గీయులు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే రేవూరి తమపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారంటూ ఆందోళనకు దిగ‌డంతో పాటు కొండా వర్గీయుల ధర్నాతో వరంగల్- నర్సంపేట రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఏదేమైనా సురేఖ దూకుడు రాజ‌కీయంగా రేవంత్ కు ఎప్ప‌టిక‌ప్పుడు చిక్కులు త‌ప్ప‌డం లేదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: