శ్రీవారి లడ్డూలో జంతువుల నూనె కలిపారన్న చంద్రబాబు.. వైవీ సుబ్బారెడ్డి సవాల్ ఇదే!

Suma Kallamadi
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జంతువుల నూనె కలిపారని ఆరోపించారు. నాసిరకం పదార్థాలు, జంతువుల కొవ్వును గత ప్రభుత్వం వినియోగించిందన్నారు. ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలు నాసిరకం పదార్థాలతోనే తయారయ్యాయని పేర్కొన్నారు. దీనిపై ఒక్కసారిగా హిందువులలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తారు. లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపయోగించారని ప్రస్తుత సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆలయంలో అన్నీ మార్చామని, దీంతో నాణ్యత మెరుగుపడిందని చెప్పారు. దీనిపై వైసీపీ నుంచి పలువురు స్పందిస్తున్నారు. ఇక టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన వైసీపీ కీలక నేత వైసీపీ సుబ్బారెడ్డి ఈ అంశంపై స్పందించారు. చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తిరుమల ఆలయ పవిత్రతను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీయలేదని, లేనిపోని ఆరోపణలతో చంద్రబాబు దెబ్బతీశారని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తిరుమల పవిత్రతకు, కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి తీవ్ర నష్టం కలిగించారని రెడ్డి ఎక్స్‌ (ట్విటర్)లో పేర్కొన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా దురుద్దేశపూరితమైనవన్నారు. ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఆరోపణలు చేయకూడదని పేర్కొన్నారు.  'తిరుమల పవిత్రతను, కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసి చంద్రబాబు నాయుడు ఘోర పాపం చేశాడు. తిరుమల ప్రసాదం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్య అవాస్తవం. ఇలాంటి మాటలు మాట్లాడడం లేదా ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనాల కోసం ఏ స్థాయికైనా చంద్రబాబు దిగజారగలడని మరోసారి రుజువు అయింది' అని టీటీడీ మాజీ చైర్మన్ తెలిపారు.  “తిరుమల ప్రసాదం విషయంలో దేవుని సాక్షిగా నేను, నా కుటుంబం ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా?" అని సవాల్ విసిరారు. ఏదేమైనా ఈ అంశం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని చెప్పొచ్చు. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రసాదం తయారీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: