పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీపై ప్ర‌జా తిరుగుబాటు...!

RAMAKRISHNA S.S.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికారం చేతిలో ఉండడంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఇష్టం వచ్చినట్టు పెత్తనం చేసుకుంటూ వెళ్లారు. మిథున్ రెడ్డి ఉభయగోదావరి జిల్లాలను చక్కబెడితే.. పెద్దిరెడ్డి రాయలసీమ మొత్తం తన హవా నడిపించారు. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పుంగనూరులో అన్ని పంచాయితీలను ఏకగ్రీవం చేసుకున్నారు. అసలు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు నామినేషన్ వేస్తే కూడా బెదిరించి మరీ ఏక‌గ్రీవం చేయించారు.


ఆ పాపాలు ఇప్పుడు వీరిని వెంటాడుతున్నాయి. దీంతో తండ్రి కొడుకులు పుంగనూరులో అడుగు పెట్టేందుకు కూడా అక్కడి ప్రజలు ఇష్టపడటం లేదు. వైసీపీ పాలనలో ప్రశ్నించిన వారిపై, ప్రత్యర్థులపై దాడులు చేయడంతో పాటు వారిపై కేసులో పెట్టి భయానక వాతావరణం సృష్టించారు. ఇప్పుడు కాలం తిరగబడింది. దీంతో ప్రజలు కూడా తండ్రి, కొడుకులపై తిరగబడుతున్నారు. ఇటీవల పెద్దిరెడ్డి పుంగనూరు పర్యటనను వ్యతిరేకించిన నియోజకవర్గ ప్రజలు.. ఇప్పుడు ఆయన కొడుకు మిధున్‌ రెడ్డి పుంగనూరులో కాలు పెట్టడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వెంటనే మిథున్ రెడ్డి.. పుంగనూరు నుంచి వెళ్లి పోవాలంటే నినాదాలు చేశారు.


కూటమి కార్యకర్తలకు ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన రావడంతో.. అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పెద్దిరెడ్డి.. పుంగనూరు వేదికగా రాజకీయం కొనసాగించడం కష్టంగానే కనిపిస్తోంది. అసలు తండ్రీ, కొడుకుల రాకను అక్కడ ప్రజల స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తున్నారంటే.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ సైతం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి పబ్లిక్ ను పోలీసులు ఆపుతారు అనుకోవడం కూడా అవివేకమే అవుతుంది. ఏది ఏమైనా చేసిన వాళ్లకు చేసుకున్నంత అన్నట్టు పెద్దిరెడ్డి కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో.. ఇప్పుడు ప్రజల నుంచే వారిపై తిరుగుబాటు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: