దారుణం: నవ దంపతులను బలి తీసుకున్న కీచక రాబంధువులు!
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్ (28), అదే మండలానికి చెందిన శైలజ (24)కు ఏడాది కిందట వివాహమైంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇక ఎంతో సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలో సమీప బంధువులే చిచ్చుపెట్టారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు దంపతులిద్దరూ కుటుంబీకులకు చెప్పి, సోమవారం ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం తాను గతంలో ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువులు సూటిపోటి మాటలతో ఇప్పటికీ చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, మానసికంగా చాలా కృంగిపోయానని... ఈ నేపథ్యంలో తన భర్త కూడా ఎంతో మానసిక క్షోభకి గురయ్యారంటూ దంపతులు ఇద్దరూ సెల్ఫీ వీడియోను చిత్రీకరించి పోలీసులకు పంపి మరీ చనిపోవడానికి సిద్ధపడ్డారు.
ఈ వీడియోలను కోటగిరి ఎస్సై సందీప్కు పంపగా ఈ వీడియో చూసిన ఆయన వెంటనే స్పందించి నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్కు వీడియోతోపాటు వారి సెల్ఫోన్ నంబరు పంపి, అప్రమత్తం చేశారు. కానీ లాభం లేకుండా పోయింది. ఎస్సై ఇచ్చిన సమాచారం ప్రకారం స్థానిక పోలీసులు బాసర వంతెన దగ్గరకు వెళ్లి మాటు వేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఎంత గాలించినా వారి జాడ కనిపించలేదు. దీంతో బాధితుల ఫోన్ నంబరును ట్రాక్ చేయగా ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు తెలిసింది. వెంటనే నవీపేట ఎస్సై గుర్తించి అక్కడికి చేరుకునేటప్పటికే ఆలస్యమైంది. అప్పటికే అనిల్, శైలజ.. మృతదేహాలు రైలు పట్టాలపై కనిపించాయి. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.