ఓడిపోయినా మారని జగన్.. రెడ్లే ముద్దు... బీసీ, ఎస్సీ, మైనార్టీలు వద్దే వద్దు..?
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో పదేపదే.. నా బిసి, నా ఎస్సి, నా మైనార్టీలు అంటూ పిలుచుకోవటమే తప్ప.. ఆ వర్గాలపై జగన్కు నిజంగా ప్రేమ ఉందా ? అన్నది సందేహమే. వైసీపీకి లోక్సభలో నలుగురు, రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం 15 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 15 మందికి కలిపి పార్లమెంటరీ పార్టీ నేత అని ఒక పోస్ట్ ఉంది. దానికి ఈ రెడ్ల త్రయంలో ఒకరైన తన సొంత బాబాయి వైవి సుబ్బారెడ్డికి ఈ పోస్ట్ కట్టబెట్టారు. ఇక లోక్సభలో వైసిపి పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి జగన్ బాధ్యతలు అప్పగించారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జగన్కు ఎంత ?కావలసిన వ్యక్తో చెప్పక్కర్లేదు. ఇక రాజ్యసభలో విజయ్ సాయి రెడ్డి వైసీపీపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికలలో విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉంటూ నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేసి.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. వాస్తవంగా జగన్ ఈ మూడు కీలక పదవులు రెడ్లకే కట్టబెట్టి.. మరోసారి తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన తిరుపతి ఎంపీ గురుమూర్తికి లోక్సభలో వైసీపీ పక్ష నేతగా అవకాశం ఇస్తే బాగుండేదన్న చర్చ జరుగుతుంది. అలాగే రాజ్యసభలో బీసీ ఎంపీలు వైసీపీకి పెద్ద ఎత్తున ఉన్నారు. వారిలో ఒకరికి రాజ్యసభ పక్ష హోదా.. లేదా పార్లమెంటరీ పక్ష నేత హోదా ఇస్తే ఎంత బాగుండేది.. పార్టీకి కూడా చాలా ప్రయోజనకరంగా ఉండేది.. అన్న చర్చలు నడుస్తున్నాయి. ఏది ఏమైనా పేరుకు మాత్రమే జగన్ బీసీ, ఎస్సి మంత్రం పఠిస్తున్నా.. అన్ని కీలక పదవులు తన రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టుకుంటున్నారు. ఓటమి తర్వాత కూడా జగన్ లో ఏమాత్రం మార్పు లేదు.