పేద ఎంపీ ' కలిశెట్టి ' సంచలనాలకు ఇదే ఛాన్స్.. !
- కన్నెధార పోరాటయోధుడు పార్లమెంటుకు
- వెనకబడ్డ ఉత్తరాంధ్ర సమస్యలపై ఫోకస్ చేస్తాడా
( ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటుకు ఎన్నికైన వారిలో పార్టీకి చెందిన అతి సాధారణ కార్యకర్తలు కూడా ఉన్నారు. చివరకు చంద్రబాబు సైతం అలా ఎంపీగా గెలిచిన ఆ సాధారణ కార్యకర్తను ఉద్దేశించి ఢిల్లీ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ ఉందా అని అడిగారు అంటే చంద్రబాబు ఎలాంటి సాధారణ కార్యకర్తకు ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంటుకు పంపారో తెలుస్తోంది. పైగా ఆ సాధారణ కార్యకర్త బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం.. బీసీల్లో పార్టీకి ఉన్న పట్టుకు క్రేజ్ కు మరింత నిదర్శనం అని చెప్పాలి. అలా ఆ సాధారణ కార్యకర్త పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు అంటే నిజంగా ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన విషయం. ఆ ఎంపీ ఎవరో ? కాదు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. వాస్తవానికి కలిశెట్టి రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీలో చాలా సామాన్యంగా ప్రారంభమైంది.
ఎప్పుడో 2003లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎచ్చెర్ల ఏఎంసీ చైర్మన్గా పనిచేశారు. అప్పటినుంచి కలిశెట్టి రాజకీయంగా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు. మధ్యలో 20 సంవత్సరాలు గడిచిపోయాయి. నాలుగుసార్లు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. అసెంబ్లీలో అడుగుపెట్టి ఒక్కసారైనా అధ్యక్షా అనాలనేది కలిశెట్టి కోరిక. రాష్ట్ర విభజన జరిగింది. రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. కలిశెట్టి సరైన అవకాశం కోసం చూస్తున్న అవకాశం రాలేదు. 2019లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అలాంటి సమయంలో ఎవరు బయటకు వచ్చి పార్టీ జెండా పట్టే సాహసం చేయట్లేదు. అలాంటి టైం లో ఎచ్చెర్ల నియోజకవర్గం లో జెండా పట్టి గ్రామం గ్రామం తిరిగి పార్టీని బతికించుకున్నాడు కలిశెట్టి. కచ్చితంగా అప్పలనాయుడుకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. మధ్యలో పార్టీలోని కొందరు నాయకుల నుంచి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి.. అప్పలనాయుడికి అంత సీన్ ఉందా అని డైలాగులు కొట్టిన పార్టీ నేతలు కూడా ఉన్నారు. వాటన్నింటినీ పటాపంచలు చేశారు అప్పలనాయుడు.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరంధ్రలో పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చిన సమయంలో లోకేష్, చంద్రబాబు దృష్టిలో పడ్డారు. అప్పలనాయుడులో విషయం ఉందని పార్టీకి ఫ్యూచర్ అవసరాలకోసం కావాలని వారిద్దరు భావించారు. అందుకే చంద్రబాబు ఏకంగా విజయనగరం పార్లమెంటు టికెట్ ఇచ్చారు. అప్పలనాయుడుకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా చాలామంది ఖచ్చితంగా ఓడిపోయే సీటు అని ఎగతాళి చేశారు. అలాంటి పార్లమెంటు సీటులో ఏకంగా 2.38 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించిన అప్పలనాయుడు సగర్వంగా పార్లమెంట్లో అడుగుపెడుతున్నారు. టీడీపీని నమ్ముకుని 20 ఏళ్లు పనిచేసిన ఓ సాధారణ కార్యకర్తకు ఇంతకు మించిన అసలు సిసలు గౌరవం ఎక్కడ దక్కుతుంది.
అప్పలనాయుడు పోరాటాల పురిటి గడ్డలో పుట్టాడు. శ్రీకాకుళం జిల్లాలోని వెనుకబడిన మారుమూల గిరిజన ప్రాంతాలలో కన్నెధార కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్ ను అడ్డుకునే క్రమంలో ఓ చిన్న వ్యక్తిగా పోరాటం చేసి.. ఆ తర్వాత కన్నెధార పోరాటాన్ని ఉధృతం చేసినప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. ప్రభుత్వాలపై పోరాటం చేసి.. అక్రమ మైనింగ్ లీజు రద్దు చేయించాడు. నిజంగా కన్నెధార కొండపై అక్రమ మైనింగ్ కోసం అప్పలనాయుడు చేసిన పోరాటం శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది సాధారణ ప్రజల్లో స్ఫూర్తి నింపింది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని పోరాటాలు చేసిన వారికి ఎప్పటికీ అయినా లైఫ్ ఉంటుందనేందుకు అప్పలనాయుడు జీవితమే పెద్ద ఉదాహరణ. అప్పలనాయుడు కీలకమైన ఉత్తరంధ్రలో పలు ప్రాజెక్టుల విషయంలో పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడుతో కలిసి ఫైట్ చేసి నిధులు రప్పించడంలో ఇప్పుడు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.