బాబు క్యాబినెట్ లోకి బెజవాడ వంగవీటి రాధా.. ఈ ట్విస్ట్ ఏంటి బాబు?

Suma Kallamadi
వంగవీటి రంగ తనయుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అయితే నాన్న రంగ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన రాధా ఎందుకనో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు అని అనడంలో అతిశయోక్తి లేదు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా.. ఆ తరువాత తన ఛరిష్మాని కొనసాగించలేకపోయారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం తరుఫున పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. అనంతరం జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి ఫలితం దక్కలేదు.
ఆ తరువాత 2019 ఎన్నికల ముందు జగన్‌తో విభేదించి టీడీపీ చేరడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేయడానికి రాధాకు అవకాశం ఇవ్వలేదు బాబు. అదేవిధంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీలో టికెట్ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధాకు నిరాశ ఎదురైంది. ఏదిఏమైనప్పటికీ ఆయన భంగపడకుండా టీడీపీలోనే ఉంటూ కూటమి నేతల తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా వైసీపీ ఓటమే లక్ష్యంగా ఆయన పని చేశారు. కాపులు అధిక సంఖ్యలో ఉండే నియోజకవర్గాల్లో వంగవీటి రాధా ప్రభావం అధికంగా కనిపించింది.
ఈ తరుణంలో టీడీపీ కూటమిలో వంగవీటి రాధాకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆయన్ను చంద్రబాబు ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసే యోచనలో ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ప్రస్తుతం శాసన మండలిలో 4 ఖాళీలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాటిలో ఒకటి రాధాకు కేటాయించి ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని బాబు యోచిస్తున్నట్టు కనబడుతోంది. అందుకే తొలుత 25 మందితో మంత్రివర్గాన్ని భర్తీ చేయాలని భావించినప్పటికి .. రాధా కోసం ఆ మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఉంచారని సమాచారం. కాపుల కోటాలో ఇవ్వాలంటే కచ్చితంగా రాధాకు మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: