జూలై 1న చంద్ర‌బాబు ఎదుర్కొనే ఫ‌స్ట్ బిగ్ స‌వాల్ ఇది..!

RAMAKRISHNA S.S.
- ప్ర‌తి పెన్ష‌న్ రు. 7 వేలు ఇవ్వాల్సిందే
- ఫెన్ష‌న్ల‌కే రు. 12 వేల కోట్లు అత్య‌వ‌స‌రం
- 66 ల‌క్ష‌ల పెన్ష‌న్ల‌కు తోడు.. 50 యేళ్లు దాటిన వారితో మ‌రింత భారం
(  అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో కూట‌మి పార్టీలు క‌నీవినీ ఎరుగ‌ని మెజారిటీ ద‌క్కించుకుని అధికారంలోకి వ‌చ్చాయి. ఈ నెల 12న ముఖ్య‌మంత్రిగా టీడీ పీ అధినేత చంద్ర‌బాబుప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. దీనిని గ్రాండ్‌గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదొక అద్భుత ఘ‌ట్టం. అనిర్వ‌చ‌నీయ అనుభూతి కూడా. అయితే.. ఆవెంట‌నే 18 రోజుల్లోనే చంద్ర‌బాబు స‌ర్కారుకు ప్ర‌ధాన స‌వాల్ ఎదురు కానుంది. జూల్ 1న ఈ స‌వాల్ ఆర్థిక రూపంలో క‌దిలించ‌నుంది. ఇది మామూలు విష‌యం కాదు. ఏదో మాట‌కు చెప్పే స‌వాల్ కూడా కాదు.అత్యంత కీల‌క‌మైన స‌వాల్‌. పైగా చంద్ర‌బాబు ఇమేజ్‌కు సంబంధించిన స‌వాల్.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పిన హామీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇస్తున్న సామాజిక పింఛ‌న్‌ను రూ.4000ల‌కు పెంచు తామని. అంతేకాదు.. రాష్ట్రంలో ఏప్రిల్ మాసం నుంచి కూడా రూ.1000 చొప్పున పెంచి ఇస్తామ‌ని కూడా చంద్ర‌బాబు తెలిపారు. ఆయ‌నే వీటిని లెక్క‌గ‌ట్టి.. ఒక్కొక్క‌రికీ రూ.3000 చొప్పున అద‌నంగా క‌లిపి ఇస్తామ‌న్నారు. అంటే ఒక్కొక్క‌రికీ రూ.7000 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్క‌డే మ‌రోహామీ కూడా.. చంద్ర‌బాబు ఇచ్చారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ల‌బ్ధిదారుల సంఖ్య‌ను త‌గ్గించ‌బోమ‌ని చెప్పారు. అంటే.. ప్ర‌స్తుతం సామాజిక పింఛ‌న్లు తీసుకుంటున్న 66 ల‌క్ష‌ల మందిలో ఒక్క‌రిని కూడా త‌గ్గించే అవ‌కాశం లేదు.

దీంతో ఇంత మందికి రూ.7000 చొప్పున పింఛ‌న్ల‌ను కేవ‌లం 18 రోజుల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇదేమంత పైకి చెప్పుకొ నే తేలిక విష‌యం కాదు. ప్ర‌స్తుతం రాష్ట్రానికి అప్పుగా రానున్న రూ.2000 చోట్ల‌ను చూసుకుంటే.. ఏమాత్రం దీనికి స‌రిపోదు. ఎందుకంటే.. ప్ర‌తి నెలా వైసీపీ ప్ర‌భుత్వం రూ.6 వేల కోట్ల‌కుపైగానే.. పింఛ‌న్ల‌కు ఖ‌ర్చు చేస్తోంది. ఇప్పుడుతొలినెల‌లో ఇవి రెట్టింపు అవుతున్నాయి. అంటే.. ఎంత లేద‌న్నా.. చంద్ర‌బాబు స‌ర్కారుకు రూ.10 నుంచి 12 వేల కోట్ల రూపాయ‌లు కావాల్సి ఉంటుంది. ఇంత మొత్తం కేంద్రం నుంచి ఎలా తీసుకువ‌స్తారు? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. కేంద్రంలో కూట‌మిగా ఉన్న టీడీపీ ఉంది క‌నుక‌.. వ‌డ్డించేవాడు మ‌న‌వాడే క‌నుక సాధ్య‌మ‌నే వాద‌న ఉన్నా.. ఇది అసాధ్య‌మ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

మోడీ కూట‌మిలో బిహార్ ప్ర‌భుత్వ సార‌థి.. అక్కడి సీఎం నితీశ్ కుమార్ కూడా భాగ‌స్వామిగా ఉన్నారు. ఆ రాష్ట్రం కూడా అప్పు ట్లో ఉంది. పైగా ఆవుర‌వుమంటోంది. ఏపీకి ఏమేర‌కు సాయం చేసినా.. ఆమేర‌కు త‌మ‌కు కూడా ఇవ్వాల‌ని.. నితీశ్ ప‌ట్టుబ‌ట్టే అవ‌కాశం మెండుగా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఒక‌వేళ 5000 కోట్ల రూపాయ‌లు ఇవ్వాల‌ని కోరినా.. ఆమేర‌కు మోడీ సాయం చేస్తారా? అనేది చూడాలి. ఇక‌, ఏపీలో ఉన్న సొమ్ము ఏమైనా రూ.5000 కోట్ల మేర‌కు జ‌మ అవుతుందా? అది కూడా క‌ష్ట‌మే. ఎలా చూసుకున్నా.. జూలై 1 నాటికి రూ.10 నుంచి 12 వేల కోట్ల‌ను కూడ‌గ‌ట్టి పింఛ‌న్ల రూపంలో ఇవ్వ‌డం.. బాబుకు పెను స‌వాల్‌గా మార‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: