తెలంగాణ : రోజురోజుకీ బయటపడుతున్న కెసిఆర్ అరాచకాలు?

Suma Kallamadi
బంగారు తెలంగాణ సాకారం కేవలం కెసిఆర్ వలెనే సాధ్య పడిందని నమ్మిన తెలంగాణ ప్రజలు ఆయనను వరుసగా రెండు సార్లు సింహాసనాన్ని ఎక్కించారు. అక్కడే తేడా కొట్టింది. అవును, మొదట ఓ నాయకుడిగా వ్యవహరించిన కెసిఆర్ తరువాతకాలంలో నియంతలా వ్యవహరించడం మొదలు పెట్టారు. దాంతో మూడోసారి తెలంగాణ ప్రజలు ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇక ఈమధ్య కాలంలో ఆయన చేసిన ఘనకార్యాలు గురించి తెలుసుకున్న తెలంగాణ ఓటర్లు ఖంగు తింటున్నారు. అందులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేసులో విచారణలో ఉండగా సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్ రావు దానికి సంబంధించి అనేక విషయాలను బట్టబయలు చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ ఆధారంగా పలువురు అధికారులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, టీవీ ఛానళ్ల అధిపతుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు రుజువయ్యింది. అదేవిధంగా పెద్దాయన (కేసీఆర్) చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ రాధాకిషన్ రావు ఇచ్చిన వాగ్మూలం తాలూకు రిపోర్ట్ కాపీలు సైతం సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొట్టడం గమనార్హం.
ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై తెలంగాణ ప్రజానీకం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కొంతమంది మీడియా అధిపతుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటే మీరెంత దిగజారారో? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మీ ఒత్తిడితోనే ట్యాపింగ్ చేశానని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలానికి ఏం సమాధానం చెబుతారు? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ట్వీట్‌ చేస్తూ... "ఓటమిని ముందే గ్రహించి గెలుపు కోసం అడ్డదారులు తొక్కిన బీఆర్ఎస్ అధినేత. ఆయన కనుసన్నల్లోనే అన్నీ జరిగాయని, రాధాకిషన్ రావు వాంగ్మూలం దానికి రుజువు!" అంటూ కామెంట్ చేసింది.
ఇకపోతే ఈ కేసులో ప్రస్తుతం పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయి.. రిమాండ్‌లో ఉన్నారు. కస్టడీలో ఉన్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ అధికారులు రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుంజగరావు కన్ఫెషన్ స్టేట్‌మెంట్లలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఎన్నికలో కేసీఆర్ కోసం ఎస్‌ఐబీ అధికారులు అడ్డదార్లు తొక్కారు. దానికోసం స్పెషల్‌గా ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు భుజంగరావు, తిరుపతన్నలు తమ వాంగ్మూలాల్లో వెల్లడించడం కొసమెరుపు.
ఈ నేపథ్యంలో టార్గెట్ చేసుకున్నవారి ఫోన్లు ట్యాప్‌ చేసి... ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కెసిఆర్ కి చేరవేసేవారట. అదంతా ఒకెత్తయితే జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్‌ చేసినట్లు తాజాగా కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌తో బహిర్గతమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ట్రోల్‌ చేసే వ్యక్తులతో పాటు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందిపెట్టే విద్యార్థి సంఘాల నేతల ఫోన్లను కూడా వదలలేదని తెలుస్తోంది. ముఖ్యంగా టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై నిరుద్యోగ యువత ఏరకమైన ఆందోళనలు చేపట్టారో అందరికీ తెలిసిందే. దానికి కారకులైన వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారట! ఒక్క ఒక్కొక్క విషయం బయటపడడంతో కెసిఆర్ యొక్క దుర్మార్గం బయటపడుతోంది. దాంతో కెసిఆర్ అండ్ టీమ్ ని తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో ఓ రేంజులో ఆటాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: