ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసాయి అని చెప్పవచ్చు. కొన్ని చిన్న చిన్న గొడవలు మినహా, ఎక్కడా కూడా పోలింగ్ ఆగిపోయే పరిస్థితి అయితే ఏర్పడలేదు. అయితే పోలింగ్ పూర్తయిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తాడిపత్రి, చంద్రగిరి, తిరుపతి, నరసరావుపేట, వంటి నియోజకవర్గాల్లో కాస్త అల్లర్లు చేలరేగాయి దీంతో ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయింది. ఇదే తరుణంలో ఎన్నికల అయిపోయి ఇన్ని రోజుల తర్వాత మాచర్ల నియోజకవర్గం లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎం ధ్వంసం చేసిన ఘటన వార్తల్లో నిలిచింది.
దీంతో సీరియస్ అయినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే తరుణంలో మంత్రి అంబటి రాంబాబు మరో సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. తాను పోటీ చేసిన సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని కొన్ని పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మొత్తం 254, 253, 237, 236 పోలింగ్ బూత్ లో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ లో ఈసీ మరియు సీఈవో సహ మరో ఐదుగురిని చేర్చారు.
ఈ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతోంది. దీనిపై ఎలాంటి తీర్పు వస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ విధంగా ఓవైపు పిన్నెల్లి ఘటన మరోవైపు అంబటి రాంబాబు పిటిషన్ వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా కౌంటింగ్ తర్వాత రాష్ట్రంలో ఎన్ని గొడవలు జరుగుతాయో అని గ్రహించిన పోలీస్ యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఏ ప్రాంతంలో అయినా హింసాత్మక ఘటనలకు పాల్పడితే మాత్రం వారు ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని, చివరికి కాల్పులు కూడా జరపడానికి వెనకాడమని ముందుగానే హెచ్చరిస్తున్నారు.