ఏపీ: చంద్రబాబుపై మళ్ళీ తుప్పుపట్టిన ఆయుధాన్ని విసురుతున్న జగన్?

Suma Kallamadi
ఏపీలో ఎన్నికలవేళ విపక్షాలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకవైపు చంద్రబాబు ఈసారి ఎలాగన్నా అధికారంలోకి రావాలని చూస్తే, మరోవైపు అధికార పార్టీ వైసీపీని రెండోసారి కూడా అధికారంలోకి తెచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జగన్ తన రాజకీయ ప్రత్యర్ది అయినటువంటి చంద్రబాబుపై మరోసారి పాత చింతకాయ పచ్చడిని రాసే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో చంద్రబాబును రాజకీయంగా తీవ్రంగా దెబ్బతీసిన ఆ సవాల్ ను జగన్ మళ్లీ ఇప్పుడు ఎన్నికల వేళ బయటికి తీయడం ఇపుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కాగా ఈ సవాల్ ను స్వీకరించి చంద్రబాబు ఇబ్బందుల్లో పడతారా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. విషయం ఏమిటంటే.. 2014లో ఏపీ ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరడం జరిగింది. అయితే రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా సహా విభజన హామీలేవీ అమలు కాకపోవడంతో జగన్ ఆయనపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసారు. ఊరూరా తిరుగుతూ రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చని ఎన్డీయేతో చంద్రబాబు ఎలా కలిసి కాపురం చేస్తున్నాడని అపుడు ప్రశ్నించారు. అంతే కాకుండా హామీలు నెరవేర్చకపోతే ఎన్డీయే నుంచి తప్పుకోవాలని కూడా అపుడు చంద్రబాబుకు సవాల్ విసిరారు. దీంతో జగన్ విసిరిన ఈ ఛాలెంజ్ చంద్రబాబును ఎన్డీయేకు గుడ్ బై చెప్పి బీజేపీతో ధర్మపోరాటం చేసే వరకూ తెచ్చింది.
ఈ క్రమంలో చివరికి ఎన్డీయే, బీజేపీపై పోరాటం పేరుతో జాతీయ స్దాయిలో పార్టీల్ని కూడగట్టిన చంద్రబాబుకు చేదు అనుభవం మిగిలింది. కట్ చేస్తే... టీడీపీ గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే టీడీపీ పరిమితమైంది. దీంతో జగన్ అనుకున్నది సాధించాడు. కాగా ఇప్పుడు మరోసారి ఎన్నికలకు ముందు జగన్ చంద్రబాబుకు ఎన్డీయే ఎగ్జిట్ ఛాలెంజ్ విసరడం కొసమెరుపు. ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారిన ముస్లిం రిజర్వేషన్లపై ఎన్డీయేతో జత కట్టిన చంద్రబాబును నిలదీస్తున్న జగన్.. రిజర్వేషన్లను కాపడతారా లేక ఎన్డీయే నుంచి బయటికి వస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పుడు స్పందించడం కంటే మౌనంగా ఉంటేనే మేలని బాబు భావిస్తున్నట్టు కనబడుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: