టీడీపీ హీరో... ఆ వారసుడి హ్యాట్రిక్ విక్టరీ రాసిపెట్టుకోవచ్చు..!
- ఎర్రన్నాయుడుకు అసలు సిసలు వారసుడిగా గుర్తింపు
- రాష్ట్ర సమస్యలను బలంగా పార్లమెంటులో గళమెత్తే నేత
- వైసీపీ నుంచి బలహీన నేత తిలక్ పోటీ
( ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్న ఎర్రన్నాయుడు వారసుడు.. కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడో సారి కూడా పోటీ చేస్తున్నారు. యువ నేతగా ఆయన గుర్తింపు పొందినా.. తన కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై పార్లమెంటులో వినిపించిన గళం, ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందడం వంటివి.. ఆయనకు కలిసి వస్తున్న అంశాలు. 2014లో తొలిసారి పార్లమెంటుస్థానం నుంచి పోటీ చేసిన ఈయన.. విజయం దక్కించుకున్నారు.
ఆ ఎన్నికల్లో ఏకంగా 1.43 లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. ఇక, 2019 ఎన్నికలకు వచ్చేసరికి.. మాత్రం ఈ మెజారిటీ కేవలం 6 వేలకు పడిపోయింది. వైసీపీ దూకుడు పెంచడం.. పాదయాత్ర ఎఫెక్ట్ వంటివి ఇక్కడ బాగా పనిచేశాయి. అయితే.. గత ఐదేళ్లలో మంచి పేరు మాత్రం రామ్మోహన్నాయుడికి సొంతమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఆయన నిరంతరం పోరాడారు. అదేవిధంగా పార్లమెంటులోనూ ప్రశ్నలు గుప్పించారు.
ఇక, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల విషయానికి వస్తే.. మూడోసారి కూడా రామ్మోహన్నాయుడు బరిలో ఉన్నారు. మరి హ్యాట్రిక్ కొడతారా? లేదా ? అనేది జూన్ 4న తేలిపోతుంది. ఇక, పోటీ పరంగా చూసుకుంటే .. బలమైన పోటీలోనే ఉన్నారని చెప్పాలి. తొలి దశలో ఎర్రన్నాయుడి వారసుడిగా ప్రజలు ఆయనను గెలిపిస్తే.. రెండో సారి పనితీరుకు పట్టంకట్టారు. ఇక, ఇప్పుడు కూటమి పార్టీల అభ్యర్తిగా బరిలో ఉన్నారు. మరోవైపు వైసీపీ నుంచి గత ఎన్నికల్లో టెక్కలిలో అచ్చెన్న చేతిలో ఓడిన పేరాడ తిలక్ పోటీ చేస్తున్నారు.
దీంతో ఇక్కడ ఫైట్.. నువ్వా-నేనా అన్నట్టుగా సాగుతుండడం గమనార్హం. అయినప్పటికీ హ్యాట్రిక్పై రామ్మోహన్ నాయకుడు ధీమాగానే ఉన్నారు. నియోజకవర్గంలో అలుపెరగకుండా తిరుగుతున్నారు. పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటున్నారు. కూటమి పార్టీల నేతలకు కూడా.. తల్లో నాలుకగా ఉంటున్నారు కాబట్టి రామ్మోహన్ గెలుపు ఖాయం కావొచ్చు. కానీ.. అంత ఈజీ అయితే కాదు. మరింత శ్రమించాలనేది నియోజకవర్గం పరిస్తితులను అంచనా వేస్తున్న పార్టీ నాయకులే చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.