అక్క‌డ గెలుపు రేవంత్‌రెడ్డికి స‌వాల్‌: తెలంగాణలోనే ఆ సీటు అంత హాట్‌గా మారిందా..?

RAMAKRISHNA S.S.
తెలంగాణ సమాజం ఇప్పుడు నాగర్ క‌ర్నూల్ వైపు చూస్తోంది..  పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ క‌ర్నూల్ అభ్యర్థులుగా బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,  కాంగ్రెస్ నుంచి మల్లు రవి,  బిజెపి నుండి పోతుగంటి భరతులు బరిలో ఉన్నారు, ఈ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండ‌టంతో తెలంగాణ  రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంతకుముందు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు.  ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్‌ నుంచి బీఎస్పీ నుంచి  పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్క‌డ పోటీ చేసినా గెలుస్తాన‌నే ధీమాతో ఉన్న ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌ను సిర్పూర్ ప్ర‌జ‌లు అక్కున చేర్చుకోలేక పోయారు.

దీనికి కారణాలు అనేకం ఉన్నాయ‌నుకోండి. ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సిర్పూర్ ప్ర‌జ‌ల ఆదరణ కోల్పోవ‌డంతోనే మూడోస్థానానికి ప‌రిమితం అయ్యార‌ని వినికిడి. ఎలాగైన చ‌ట్టస‌భ‌ల్లో అడుగుపెట్టాల‌నే ఆర్ ప్ర‌వీణ్ కుమార్ ఆశ‌యం నెర‌వేర్చుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ను వ్యతిరేకించే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదే కేసీఆర్ తో జ‌త క‌ట్టి బీ ఆర్ ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయిన బీ ఆర్ ఎస్‌లో చేరిన ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ నాగ‌ర్ క‌ర్నూల్ నుంచి ఎంపీ అభ్య‌ర్థిత్వం ద‌క్కించుకున్నారు. నాగ‌ర్ క‌ర్నూల్ వాస్త‌వానికి బీ ఆర్ ఎస్ కు సిట్టింగ్ ఎంపీ స్థానం. ఇక్క‌డి నుంచి పోతుగంటి రాములు ఎంపీగా ఉన్నారు.

ఆయ‌న బీ ఆర్ ఎస్ నుంచి గెలిచారు. ఇప్పుడు ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ కారెక్క‌డంతో దిక్కుతోచ‌ని పోతుగంటి రాములు క‌మ‌లం పంచ‌న చేరాడు. ఎంపీ రాములు కొడుకు పోతుగంటి భ‌ర‌త్ రాజ‌కీయ జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని రాములు బీ ఆర్ ఎస్ నుంచి బీజేపీలో చేర‌డంతో భ‌ర‌త్‌కు బీజేపీ టికెట్ ద‌క్కింది. పోతుగంటి భ‌ర‌త్ క‌ల్వ‌కుర్తి జ‌డ్పీటీసీగా ఉన్నారు. ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ వ‌ల్ల భ‌ర‌త్‌కు బీ ఆర్ ఎస్ టికెట్ లేకుండా పోయింది. దీంతో క‌మ‌లం నుంచి భ‌ర‌త్ పోటీచేస్తుండ‌గా, ఇక కాంగ్రెస్ నుంచి సీనియ‌ర్ నాయ‌కుడు, పీసీసీ ఉపాధ్య‌క్షుడు మ‌ల్లు ర‌వి పోటీ చేస్తున్నారు. మ‌ల్లు ర‌వి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు.  

డిప్యూటీ సీఎం మ‌ల్లు  బట్టి విక్రమార్కకు స్వ‌యానా సోదరుడు. మల్లు రవి గతంలో రెండుసార్లు ఇదే నాగర్ కర్నూలు ఎంపీగా పనిచేశారు.  ఇప్పుడు ఇక్క‌డ అటు ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్ర‌తిష్టాత్మ‌క ఎన్నిక‌. ప్ర‌వీణ్ కుమార్ గెలిస్తే చ‌ట్ట స‌భ‌ల్లో కాలుపెడ‌తాడు.. త‌న ఆశ తీరుతుంది. ఇక మ‌ల్లు ర‌వి గెలిస్తే సీఎం రెవంత్‌రెడ్డి సొంత జిల్లా నుంచి గెలిపించుకున్న పేరుంటుంది. అందుకే ఈ ఎన్నిక‌పై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: