పల్నాడు: ' కాసు ' కూసాలు కదిలిపోతున్నాయ్.. సొంత పార్టీ నేతలే కసితో ఉన్నారే..!
అంతేకాదు.. స్థానికంగా నేతలకు కూడా కాసుపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. `ఆయన గెలుపు కోసం.. ఆస్తు లు తాకట్టు పెట్టాం. జెండా కట్టాం. మాకు ఒరిగిందేంటి? సర్.. ఈ సమస్య ఉంది అని అంటే ఎంత హీనం గానో చూసేవోడండి. మేం 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. కానీ, ఇలాంటి నాయకుడిని చూడలేదు ` అని వైసీపీలోనే నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు.. మరికొందరైతే.. కాసు కుటుంబంతో తమకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని.. కానీ, కాసు తరంలో మహేష్ రెడ్డి ఒక్కరే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
`కాసు ఫ్యామిలీ మాకు కొత్తకాదు. మహేష్ పుట్టకముందు నుంచి మాకు ఈ కుటుంబం తెలుసు. ఈయనేదో ఇప్పుటు మాకు రాజకీయాలు నేర్పుతున్నాడు. ఆయన అప్పాయింట్మెంటు కోసం వేచి ఉన్నా.. కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. రేపు మా అప్పాయింట్ మెంటు ఎలా ఇస్తాం. అప్పుడు మేం కూడా చూపిస్తాం. వాళ్ల నాన్న గారు, తాతగారి నుంచి కూడా మా కుటుంబం వారితో కలిసి ముందుకు వెళ్లింది. ఎప్పుడూ.. మేం పదవులు కోరుకోలేదు. చిన్న చిన్న పనులు మాత్రమే చేయాలని అడిగాం` అవి కూడా ఆయన చేసి పెట్టలేదు సరికదా.. కనీసం మమ్మలను పట్టించుకోనే లేదని మెజారిటీ సీనియర్ నాయకులు కక్కలేక మింగలేక ఉంటున్నారు.
గత ఎన్నికల్లో కాసు గెలుపు కోసం ఎంతో పనిచేసిన వారంతా ఇప్పుడు పూర్తిగా దూరమయ్యారు. ఇక, కాసును వ్యతిరేకిస్తున్న వారిలో ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ జంగా కృష్ణమూర్తి కాసుకు ఒక ఓటు బ్యాంకును క్రియేట్ చేశారు అయితే.. అలాంటి జంగానే కాసు పక్కన పెట్టా రు. దీంతో బీసీ నాయకులు, ఆయా సామాజిక వర్గాలు కూడా.. రగిలిపోతున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కాసును ఓడించి తీరుతామని.. అంతర్గత చర్చల్లో జోరుగా తీర్మానాలు చేస్తున్నారు. దీంతో కాసుకు కూసాలు కదులుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.