వైసీపీ, టీడీపీ గెలుపు కోసం అలా చేస్తున్నాయా?

Purushottham Vinay
తెలుగు దేశం పార్టీ మొత్తం 128 ఎమ్మెల్యే సీట్లలో తన అభ్యర్ధులను ప్రకటించింది. వైసీపీ అయితే మొత్తం 175 సీట్లలో అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది.ఇవన్నీ కూడా ముందస్తు ఏర్పాట్లుగానే జరిగాయి. ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరుగుతాయని సమయం తక్కువ ఉంటుంది కాబట్టి అభ్యర్ధుల ప్రచారం కోసం అని ఉన్నంతలో గట్టి అభ్యర్ధులను పోటీకి పెట్టాలనుకుని జాబితా ఇచ్చారు.అయితే మే 13 వ తేదీన ఎన్నికలు కావడంతో కావాల్సినంత టైం ఇపుడు దొరుకుతోంది. దాంతో పాటు మరింత మెరుగైన అభ్యర్ధులు ఉంటే ఖచ్చితంగా ఆయా చోట్ల మార్పు చేర్పులు చేస్తారా చేయవచ్చనే తెలుస్తుంది.అధికార పార్టీ వైసీపీలో చూస్తే కొన్ని చోట్ల అభ్యర్థుల లిస్ట్ మీద కొంత అసంతృప్తి కనిపిస్తోందని అంటున్నారు. మరి కొన్ని చోట్ల సిట్టింగులకే సీట్లు ఇవ్వడం వల్ల గెలుపు అవకాశాలు ఎంతమేరకు ఉంటాయన్న దానిపై పార్టీలో చర్చ సాగుతోంది. దాంతో మళ్లీ సర్వేలు లాంటివి నిర్వహించి అవసరం అనుకుంటే మార్పు చేర్పులు  చెయ్యొచ్చని అంటున్నారు.గాజువాక ఇంచార్జిగా ఉరుకూటి చందుని నియమించడం జరిగింది. ఆ తరువాత ఆయన్ని తప్పించి మంత్రి గుడివాడ అమర్నాథ్ కి అక్కడ ఛాన్స్ ఇచ్చారు. చివరికి ఫైనల్ లిస్ట్ లో ఆయన్ని అభ్యర్ధిగా ప్రకటించారు. అయితే దీని మీద ఉరుకూటి చందు తన అనుచరులు అభిమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పడం జరిగింది.తనకు మూడు నెలల పాటు సహకరించిన పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలియచేశారు.


మరో వైపు చూస్తే ఇంకా టైం ఉందని అధినాయకత్వం తనకు అన్యాయం చేయదని ఉరుకూటి చందు అన్న మాటలు ఇపుడు సెన్సేషన్ అవుతున్నాయి. అంటే మంత్రి గుడివాడను కూడా మార్చేసి మళ్లీ చందుకు ఛాన్స్ ఇస్తారా అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం. మరి చందుకు ఏ రకమైన భరోసా దక్కిందో తెలియదు కానీ మార్పులు ఉంటాయని పరోక్షంగా సంకేతాలని ఇచ్చారు. విశాఖ జిల్లాలో ఎక్కడా యాదవులకు  వైసీపీ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆ సామాజిక వర్గం కోపంగా ఉంది. దీనిని సరిచేసేందుకు కూడా మార్పు చేర్పులు ఉండవచ్చు అంటున్నారు. ఇక ఉత్తరాంధ్రాతో సహా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల అవసరం అనుకుంటే గెలుపు అవకాశాలను చూసుకుని మార్పులు చేయవచ్చని కూడా ప్రచారం సాగుతోంది.టీడీపీ పార్టీలో కూడా అసంతృప్తులు ఉన్నాయి. పెందుర్తి టికెట్ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వాలని టీడీపీ క్యాడర్ అంతా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తోంది. బండారుకి సీటు ఇస్తే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెబుతోంది. ఇలాంటివే జిల్లాలో మరికొన్ని సీట్లు ఉన్నాయని  మార్పు చేర్పులకు టీడీపీ సిద్ధపడవచ్చని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: