AP BJP: అభ్యర్థుల ఎంపికపై కసరత్తు?

Purushottham Vinay
రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. సిద్ధం అంటూ అధికారపార్టీ వైసీపీ రంగంలోకి దూకింది. ఈ యుద్ధానికి సంసిద్ధం అంటూ టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ముందుకు సాగుతున్నాయి.ఈ నేపథ్యంలో కమలం పార్టీ బీజేపీ కూడా కదనానికి కాలు దువ్వుతోంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపించేందుకు రెడీ అయింది. ఇక రెండు రోజుల పాటు జరిగిన పార్టీ కీలక సమావేశాల్లో నాయకులను సిద్ధం చేయడమే కాకుండా.. అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు మొదలుపెట్టింది.మొత్తం 2,500కు పైగా వచ్చిన అప్లికేషన్స్‌ను వడపోసే క్రమంలో భాగంగా.. రెండు రోజుల పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు ఇంకా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ నాయకుడు శివ ప్రకాష్‌తో పాటు మరి కొంతమంది ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ అభ్యర్థుల స్క్రీనింగ్ జరిగింది. ఒక్కో జిల్లాతో 45 నిమిషాల నుంచి గంట పాటు జరిగింది ఈ సమావేశం.


స్థానిక పరిస్థితులు, ఆశావహుల ఆర్థిక పరిస్థితులు ఇంకా పార్టీలో ఎప్పటి నుంచి పని చేస్తున్నారు అనే అంశాలను ప్రామాణికంగా.. ఒక్కో అసెంబ్లీ స్థానానికి ముగ్గురు అలాగే పార్లమెంట్ సీటుకు ఇద్దరి చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తంగా 175 అసెంబ్లీ ఇంకా 25 పార్లమెంట్ స్థానాలకు 525 మందికి పైగా అభ్యర్థులను కన్ఫర్మ్ చేసింది రాష్ట్ర నాయకత్వం. ఇక ఈ లిస్ట్‌ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులు ఫైనల్ కానున్నారు. త్వరలోనే కొంతమంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే విధంగా ఏపీ బీజేపీ కసరత్తు చేస్తోంది.ఇక పొత్తుల విషయానికి వస్తే వాటి గురించి ఈ సమావేశాల్లో ఎలాంటి చర్చ జరగలేదనీ.. ఇంకా ఈ విషయంలో కేంద్ర నాయకత్వానిదే అంతిమ నిర్ణయమని మరోసారి ప్రకటించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి..అలాగే మరోవైపు ఎన్నికల ప్రచారం, వ్యూహాలు, ప్రస్తుత పరిస్థితులపై అన్ని జిల్లాల ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఎన్నికలకు వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో కీలక సూచనలని చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: