అమరావతి : టీడీపీ నేత ఇంటిపై ఈడీ దాడులు
మాజీ ఎంపీ, తెలుగుదేశంపార్టీ నేత రాయపాటి సాంబశివరావు వ్యాపారాలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. ఇళ్ళు, ఆఫీసులపైన ఏకకాలంలో దాడులు చేసింది. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ మొత్తం 15 చోట్ల దాడులు చేసి సోదాలు నిర్వహించింది. రాయపాటి ఇల్లుపైనే కాకుండా ఆయన కొడుకు రాయపాటి రంగారావు, ఆయన కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ ప్రమోటర్ల ఇళ్ళపైన కూడా దాడులు జరిగాయి.
ఇలాంటి దాడులు గతంలో కూడా చాలాసార్లు జరిగాయి. ట్రాన్స్ ట్రాయ్ పేరుతో రాయపాటి రు. 9,383 కోట్లు అప్పులు తీసుకున్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో చాలా బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో ప్రజాధానాన్ని అప్పులుగా తీసుకుని తిరిగి తీర్చకుండా ఎగ్గొట్టారనే ఆరోపణలు రాయపాటిపైన ఉన్నాయి. అలా ఎగ్గొట్టిన వేలాది కోట్లరూపాయలను షెల్ కంపెనీలకు, హవాలా మార్గంలోను దేశాన్ని దాటించేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
విచిత్రం ఏమిటంటే ఎన్నిసార్లు సీబీఐ, ఈడీ దాడులు జరిగినా ఒక్కసారి కూడా రాయపాటి అరెస్టు జరగలేదు. ఒకవైపు మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు దొరికాయని దర్యాప్తు సంస్ధలు అంటునే ఉంటాయి కానీ అరెస్టులు మాత్రం జరగటంలేదు. ఇక్కడే అందరికీ దర్యాప్తు సంస్ధల చిత్తశుద్దిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. బ్యాంకుల్లో వేల కోట్లరూపాయలు అప్పులు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపనలు రాయపాటిపైన ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఆరోపణలను ఎదుర్కొన్నారు, దాడుల్లో కీలకమైన డాక్యుమెట్లను సీజ్ చేసి తీసుకెళ్ళినట్లు ప్రచారం జరిగింది.
కీలకమైన డాక్యుమెంట్లు దొరికిందే నిజమైతే మరి కేసులు పెట్టి ఎందుకు అరెస్టులు చేయలేదు ? కొన్ని కేసులు నమోదై కోర్టుల చుట్టూ తిరుగుతున్నది అయితే వాస్తవమే. కానీ ఇలా ఎంతకాలం కోర్టుల చుట్టూ తిరుగుతు నెట్టుకొస్తారు ? మనదేశంలో కోర్టులో కేసు ఫైనల్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అందరికీ తెలిసిందే. ఈలోపు వీళ్ళు ఎంపీలుగా పోటీచేస్తునే ఉంటారు, గెలుస్తునే ఉంటారు. ఇంకా బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు.