అమరావతి : మార్గదర్శిపై కీలక నిర్ణయం ?

Vijaya


మార్గదర్శి చిట్ ఫండ్స్ పై తొందరలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందా ? అధికారయంత్రాంగం సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. మొత్తం అన్నీ శాఖలను మూయించేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా చిట్ వ్యాపారాన్ని ప్రారంభించటమే కాకుండా, నిర్వహణ కూడా అంతా మోసపూరితమే అని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చేసింది. మార్గదర్శిలో భారీ అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించిందని సమాచారం.



ప్రభుత్వం దాడులుచేసి కొన్ని బ్రాంచ్ ల మేనేజర్లను అరెస్టులు చేయటం, ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ రామోజీ కోడలు చెరుకూరి శైలజపై చీటింగ్ కేసులు పెట్టడం అందరికీ తెలిసిందే. రేపో మాపో విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇవ్వబోతున్నదట ప్రభుత్వం. అందుకనే తమపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ముందస్తు ఆదేశాలు ఇవ్వాలని రామోజీ తెలంగాణా హైకోర్టులో కేసు వేశారు. అయితే రామోజీ పిటీషన్ పై కోర్టు పెద్దగా స్పందించలేదు.



ఎందుకంటే దాడులు జరిగింది, అరెస్టులు జరిగిందంతా ఏపీలో అయితే దానికి సంబంధించిన కేసు తెలంగాణా హైకోర్టులో ఎందుకు వేశారంటు రామోజీ తరపున లాయర్ ను నిలదీసింది. దానికి లాయర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. దాంతో ఈ కేసును ఏపీ హైకోర్టులోనే దాఖలు చేసుకోండని చెప్పేసింది. ఈ విషయాన్ని పక్కనపెడితే మూడురోజుల తనిఖీల్లో సుమారు రు. 400 కోట్ల మేర అక్రమాలు, అవినీతి జరిగిందని అధికారులు గుర్తించినట్లు స్టాంప్స్ అంట్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రామకృష్ణ,  ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వేర్వేరుగా ప్రకటించారు.



సంస్ధ మేనేజర్లు, ఫోర్ మెన్ లాంటి కీలకస్ధానాల్లో ఉన్న వ్యక్తులు తమకు సహకరించటంలేదని మండిపోయారు. తమకు కావాల్సిన ఫైళ్ళను తమ ముందుంచితే ఇంకా ఎంతమొత్తంలో అక్రమాలు జరిగాయనే విషయం తేలుతుందన్నారు. చిట్ ఫండ్ చట్టం ప్రకారం చిట్టేతర వ్యాపారాలకు చిట్ ఫండ్ నిధులు మళ్ళించకూడదన్నారు. కానీ మార్గదర్శి డిపాజిట్లలో చాలా భాగం చిట్టేతర వ్యాపారాలకు తరలించినట్లు ఆధారాలతో సహా దొరికిందన్నారు. సంస్ధ యాజమాన్యం తమకు ఏమాత్రం సహకరించటంలేదన్నారు. అన్నీ ఆధారాలు దొరికిన తర్వాత అవసరమైతే మార్గదర్శిని క్లోజ్ చేసేస్తామని కూడా స్పష్టంగా ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: