ఏపీకి తుఫాన్ హెచ్చరిక..ఆ ప్రాంతాల పై ప్రభావం..
సీమలోనే కాకుండా ఎగువ కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు నిండుకుండల్లా మారుతున్నాయి. సత్యసాయి జిల్లా గోరంట్ల వద్ద… ఎటుచూసినా నీళ్లే. పెద్దచెరువు వంకలో ప్రైవేట్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. 30 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీమ్. నంద్యాల జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. బనగానపల్లె నియోజకవర్గంలో సంజామల వద్ద పాలేరు వాగుపై నాలుగడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ముదిగేడు- కమలాపురి రహదారిలో వంతెనపై వర్షపు నీరు 10 గ్రామాల ప్రజల్ని దిగ్బంధనం చేసింది. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అవుకు రిజర్వాయర్ వద్ద సైరా జలపాతం కనువిందు చేస్తోంది.
వేదావతి నదికి నీటి ప్రవాహం పెరగడంతో…. తుంగభద్ర దిగువ కాలువ 121 వ కిలోమీటర్ మైలురాయి వద్ద బ్రిడ్జీ దిమ్మె నీటిలో కొట్టుకుపోయింది. వేదావతినదిలో 800 మీటర్ల మేర ఉన్న బ్రిడ్జీకి సంబంధించి మూడు సపోర్ట్ దిమ్మెలకు ప్రమాదం పొంచివుంది. ఇటు… హోళగుంద మండలంలో వేదావతి నది వంతెనపై వరద నీరు చేరింది. బళ్లారికి రాకపోకలు ఆగిపోయాయి. లోతట్టు గ్రామాలకు వెళ్లే రహదారులు మూసుకుపోయాయి.పుట్టపర్తిలో చిత్రావతి నదిలో ప్రవాహం హోరెత్తుతోంది. పోటెత్తిన వరదతో బుక్కపట్నం చెరువు నిండుకుండను తలపిస్తోంది. కొత్తచెరువు రెండు వైపులా వరద ఉధృతి కొనసాగుతోంది. రాకపోకలు నిలిపివేసి పహారా కాస్తున్నారు పోలీసులు. గత ఇరవై ఏళ్లలో బుక్కపట్నం చెరువుకు వరద రావడం ఇది రెడోసారి. కర్నాటక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పుట్టపర్తి దగ్గర చిత్రావతి నదిలోకి పెద్ద ఎత్తున వరద నీరొచ్చి చేరుతోంది..శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు వరదనీటిని వదలడం ఇది ఆరవసారి. దాంతో విద్యుత్ ఉత్పత్తి పెరిగింది.