అమరావతి : పవన్ దెబ్బకు అయోమయం పెరిగిపోతోందా ?
రాబోయే ఎన్నికల్లో పోటీ విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో ఎలాంటి క్లారిటి ఉందో ఎవరికీ తెలీదు. కానీ పవన్ దెబ్బకు పార్టీలోని నేతలు, శ్రేణుల్లో మాత్రం రోజు రోజుకు కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనిచ్చేది లేదన్నారు. జనసేన ఎవరి పల్లకీ మోయదన్నారు. ప్రభుత్వ బాధ్యతను జనసేనే తీసుకుంటుందని ప్రకటించారు.
అంటే తానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు చెప్పకనే చెప్పారని గ్రహించాలి. ఇంత చెప్పిన పవన్ తన పార్టీ ఎన్నిస్ధానాల్లో పోటీచేయబోతోందనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. ఇదే సమయంలో పొత్తుల విషయం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని సమయం వచ్చినపుడు తానే ఒక నిర్ణయం తీసుకుంటానని తేల్చిచెప్పారు. అంటే ఒకే మనిషిలో ఇన్ని పరస్పర విరుద్ధమైన ఇన్ని రకాల వైరుధ్యాలుండటం ఆశ్చర్యమే.
ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారంటే మొత్తం 175 సీట్లకు కానీ లేదా మెజారిటి సీట్లకు కానీ జనసేన పోటీచేయక తప్పదు. పోటీచేయబోయే సీట్లలో మెజారిటి గెలుచుకుంటేనే సీఎం కుర్చీలో కూర్చోగలరు. ఒకవేళ టీడీపీతో పొత్తుంటే జనసేన మైనర్ పార్టనర్ అవుతుందే కానీ మేజర్ పార్టనర్ ఎప్పటికీ కాలేందు. మేజర్ పార్టనర్ కానపుడు సీఎం కుర్చీలో కూర్చునే అవకాశం ఉండదు. అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినచ్చేది లేదని చెప్పటమే విచిత్రం. ఓట్లు చీలకుండా అడ్డుకోవటం అనేది తన చేతిలో లేని విషయమని పవన్ ముందు గ్రహించాలి.
అసలు జనసేన పోటీచేయబోయే సీట్లపై పవన్ కు అసలు క్లారిటి ఉందా అనేదే అర్ధం కావటంలేదు. పార్టీ నేతల సమాచారం ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కనీసం 150 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు లేరనే చెప్పాలి. మిగిలిన 25 నియోజకవర్గాల్లో ఏదో పర్వాలేదన్నట్లుగా నేతలున్నారంతే. ఇంతోటి పార్టీతో వైసీపీని గెలవనివ్వను, వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలవదని సొల్లుకబుర్లు చెప్పటం పవన్ కు మాత్రమే సాధ్యం. ఇందుకనే జనసైనికుల్లో పవన్ వైఖరిపై అయోమయం పెరిగిపోతోంది.