అమరావతి : రోడ్డుమ్యాపే పవన్ కొంపముంచేస్తుందా ?
ఎప్పుడు చూసినా అయోమయమే. ఏ విషయంపైన కూడా స్ధిరమైన అభిప్రాయముండదు. ఒకసారి చెప్పిన మాట మరోసారి రివర్సులో చెబుతాడు. ఇన్ని అవలక్షణాలున్న వ్యక్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాజాగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో కూడా అదే అయోమయం. వెరసి జనసేన నేతలు, జనసైనికులకి పిచ్చిక్కిపోవటం ఖాయం. ఒకవైపు తాను బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాపు కోసం వెయిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో పరోక్షంగా చంద్రబాబునాయుడుతో పొత్తులకు సంకేతాలు పంపారు.
నిజానికి రెండుకూడా పరస్పర విరుద్ధమైనవి. ఎందుకంటే బీజేపీకి టీడీపీకి ఏమాత్రం పడటంలేదు. బీజేపీకి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుండి కమలంపార్టీ అగ్రనేతలు చంద్రబాబును అసలు దగ్గరకే రానీయటంలేదు. బీజేపీకి మళ్ళీ దగ్గరవ్వాలని చంద్రబాబు ఎంతగా ప్రయత్నిస్తున్నా కమలనాదులు ఏమాత్రం అవకాశం ఇవ్వటంలేదు. ఈ విషయం బాగా తెలిసిన పవన్ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనిచ్చేది లేదని ఎలా ప్రకటించారు ?
పవన్ ఆలోచనలు చూస్తుంటే అవసరమైతే బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు కూడా రెడీగా ఉన్నట్లే అర్ధమవుతోంది. ఎందుకంటే ఓట్లపరంగా చూస్తే జనసేన వల్ల బీజేపీ లాభపడాల్సిందే. అంతేకానీ బీజేపీ వల్ల జనసేనకు ఒరిగేదేమీ ఉండదు. కాబట్టి ఎప్పుడైనా బీజేపీని ఎడమకాలితో తన్నేసి వెళ్ళి చంద్రబాబు చంకనెక్కేయటానికి పవన్ రెడీగా ఉన్నట్లే అర్ధమవుతోంది. మరా విషయమేదో డైరెక్టుగా చెప్పేస్తే మిగిలిన వాళ్ళకు క్లారిటి వచ్చేస్తుంది కదా.
బీజేపీ నుండి వచ్చే రోడ్ మ్యాపులో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని ఉంటుందని పవన్ ఆశిస్తున్నట్లున్నారు.
అయితే వారసత్వ రాజకీయాలకు తాను పూర్తి వ్యతిరేకమని, అలాంటి పార్టీలను దూరంగా పెట్టాలని మోడి ఢిల్లీలో పిలుపిచ్చారు. బీజేపీ చీఫ్ సోమె వీర్రాజేమో రెండు నెలల క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రోడ్ మ్యాపు ఇచ్చేశారని చెప్పారు. రోడ్ మ్యాప్ రాలేదని పవన్ అంటుంటే వీర్రాజేమో రెండు నెలల క్రితమే వచ్చేసిందని చెప్పారు. ఇద్దరు చెప్పిందాట్లో ఏది నిజం ? అంటే దీన్నిబట్టి చూస్తేనే పవన్లో ఎంత అయోమయం ఉందో అర్ధమైపోతోంది. తనిష్టం వచ్చిన వారితో పొత్తు పెట్టుకునే అవకాశం పవన్ కు ఎప్పుడూ ఉంటుంది. కానీ ఒకేసారి రెండుపడవల్లో ప్రయాణం ఎప్పుడూ మంచిది కాదని గ్రహించాలి.