ఏపీలో మరో రంగం కుదేలైపోయింది.. ఇక కష్టమే ?
ఇప్పటికే ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు కంట్రోల్ చేస్తూ జీవో నెంబర్ 35 జారీ చేసింది. అప్పటి నుంచి కొనసాగుతున్న విచారణ ఇంకా నడుస్తూనే ఉంది. ఓవైపు టిక్కెట్ల ధరల తగ్గింపు అంశం మీద హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం నిబంధనలు అతిక్రమించిన థియేటర్లను వరుస పెట్టి సీజ్ చేయించే కార్యక్రమం చేస్తోంది. మరోవైపు థియేటర్ల యజమానులు ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో తాము థియేటర్లు నడప లేమంటూ స్వచ్ఛందంగా థియేటర్లు మూసివేస్తున్నారు.
గత నాలుగైదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 400కు పైగా థియేటర్లు మూత పడ్డాయి. ఓ వైపు థియేటర్లలో అఖండ - పుష్ప - నాని నటించిన శ్యామ్ సింగరాయ సినిమా లు ఆడుతున్న కూడా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఆర్.ఆర్.ఆర్ , రాధే శ్యామ్ సినిమాలను సైతం సమ్మర్ కి వాయిదా వేయాలని చూస్తున్నారు. ఒక తూర్పుగోదావరి జిల్లాలోని 70కి పైగా థియేటర్లు మూత పడ్డాయి.
కృష్ణా జిల్లాలోనూ మూతపడిన థియేటర్ల సంఖ్య 50 కు పైనే ఉంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు ...అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ పదుల సంఖ్యలో థియేటర్లు మూత పడుతున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద స్క్రీన్ ఉన్న నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట లో ఉన్న వీ ఎపిక్ థియేటర్లు సైతం మూసివేశారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా థియేటర్లు కళ్యాణ మండపాలు కానున్నాయి.