నాన్న బాటలో : ఆంధ్రోళ్ల పార్టీకి జై కొడ్తారా?
రాష్ట్రం విడిపోయాక ఎవరి దారులు వారు చూసుకున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక వర్గాలు అయితే రెండు గా చీలిపోయి ఎవరి ఆశలో వారు ఉన్నారు. కొందరిని బాబు ప్రోత్సహించాడు. ఇంకొందరిని కేటీఆర్ తమ రాష్ట్రం వెళ్లకుండా కూడా చేసి ఇక్కడ వారు తమ పనులు సాఫీగా చేసుకునేలా ఆంధ్రా పారిశ్రామిక వేత్తలకు అండగా నిలిచి ఆదర్శం అయ్యాడు. లోపల ఎన్ని కోపాలు ఉన్నా కేసీఆర్ మాత్రం అవేవీ చూపించలేదు. మంచిగా నడుచుకుని మంచి ప్రగతికే కారణం అయ్యాడు. ఆ మాటకు వస్తే పారిశ్రామిక ప్రగతి అన్నది ఇవాళ జగన్ కారణంగా ఆంధ్రాలో లేదు అన్నది వాస్తవం.
చంద్రబాబు కొంతే చేయగలిగినా అవన్నీ ప్రచార ఆర్భాటాలకే పరిమితం అయిపోయాయి. చంద్రబాబు, జగన్ కన్నా కేసీఆర్ చాలా విషయాల్లో ముందున్నారు. అదేవిధంగా ఆయన ఆంధ్రోళ్ల విషయమై చాలా హుందాగానే ఉన్నారు. ఇప్పుడు షర్మిల ఓ ఆంధ్రోళ్ల పార్టీ పెట్టింది. వైఎస్సార్టీపీ పేరిట ఆమె పార్టీ ఆరంభించినా కూడా తెలంగాణలో ఆమెను ఎవ్వరూ నమ్మరు. ఇదే నిజం అని గులాబీ దండు చెబుతోంది.
వైఎస్ షర్మిల రాజకీయ అరంగేట్రం అన్నది నిర్థారణ అయ్యాక తెలంగాణలో ఎన్నో మాటలు వినిపించాయి. విమర్శలూ వినిపించాయి. ఆమె రాకపై కొందరు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కేటీఆర్ లాంటి వారు ఆమెను వ్రతాలు చేసుకోమని ఉపదేశిస్తూ మాట్లాడారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో చాలా వైరల్ అయ్యాయి. దీంతో కొంత కాలం పోస్టుల యుద్ధం కూడా నడిచింది. అటుపై ఓ ప్రెస్మీట్ నిర్వహించినప్పుడు కూడా కేటీఆర్ ఎవరు అన్న ధోరణిలో మాట్లాడారు. ఆ మాట కూడా చాలా చాలా మాటల యుద్ధాలకు కారణం అయింది. ఏదేమైనప్పటికీ రాజశేఖర్ రెడ్డి కుమార్తెకు రాజకీయ పరిపక్వత లేని కారణంగానే అలా మాట్లాడి ఉంటారని చాలా మంది పెదవి విరిచారు. తరువాత చాలా సభల్లో కేటీఆర్ ను కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఇవన్నీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అదేవిధంగా నిరుద్యోగులకు అండగా లేని సర్కారు ఇది అని మండిపడుతూ వారి తరఫున ప్రతి మంగళవారం ఒక్కో నియోజకవర్గం ఎంచుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ఓదార్పు ఇచ్చి నిరశన చేపట్టారు. ఇవన్నీ బాగానే ఉన్నా ఆమె పార్టీని తెలంగాణలో నమ్ముతారా?