అలాంటి చిన్నారులందరికీ త్వరగా అందనున్న టీకా..?

Suma Kallamadi
12-18 ఏళ్ల వయసున్న బాలబాలికలను కరోనా మహమ్మారి నుంచి సంరక్షించేందుకు రూపొందించిన కోవిడ్-19 టీకా వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోపు అందుబాటులోకి రానుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డాక్టర్‌ ఎన్‌.కె.అరోరా ఈ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సిన్ సలహా కమిటీ అధిపతిగా వ్యవహరిస్తున్న అరోరా పెద్దల విషయంలో ప్రాధాన్యత ఎలా ఇచ్చామో.. చిన్న పిల్లల విషయంలో కూడా అదే తరహాలో ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని వ్యాఖ్యానించారు. బీపీ, క్యాన్సర్, డయాబెటిస్, గుండె రుగ్మతలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలను మెడికల్ పరిభాషలో కొమొర్బిడిటీలని అంటారు. అయితే ఇటువంటి సమస్యలు కలిగి తక్కువ రోగనిరోధకశక్తితో బాధపడుతున్న చిన్నారులకు మొదటగా టీకాలు ఇస్తామని అరోరా స్పష్టం చేశారు.

2022 సంవత్సరం మొదటి త్రైమాసికంలోపు పూర్తి ఆరోగ్యవంతమైన పిల్లలందరికీ టీకా ఇవ్వనున్నట్లు అరోరా తెలిపారు. కొ-మొర్బిడిటీల సమస్యలు ఉన్న పిల్లలలో కొత్త వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది కాబట్టి వారికి తొందరలోనే వ్యాక్సిన్లు వేస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం, భారత ప్రభుత్వం 12 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం ఒక టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. ఈ టీకా అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని అరోరా తెలిపారు. ప్రస్తుతం 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలపై కొవాగ్జిన్‌ టీకా పనితీరును పరిశీలిస్తున్నామని.. ఇది అక్టోబర్ చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని వ్యాఖ్యానించారు.

ఇండియాలో 12-17 ఏళ్ల వయస్సు లోపు ఉన్న చిన్నారులు 12 కోట్ల మంది ఉన్నారని.. వారిలో కేవలం 1% మంది మాత్రమే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని అరోరా పేర్కొన్నారు. ఈ పిల్లల అందరి కోసం ఒక జాబితా తయారు చేస్తామని వెల్లడించారు. 2 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లలు 44 కోట్ల మంది ఉన్నారని వారందరికీ వ్యాక్సిన్ చేయడం పెద్ద సవాలేనని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: