తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని... హుజురాబాద్ లాంటి ఎన్నికలు గతంలో ఎక్కడా చూడలేదని టిఆర్ఎస్ కు చురకలు అంటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కుటుంబ రాజకీయాలు చేసే వారిని తెలంగాణ ప్రజలు తిప్పికొడుతారని పేర్కొన్నారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా భువనగిరి పట్టణానికి ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు.. ఈ సందర్భంగా భువనగిరిలోని ప్రైవేట్ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... జమ్మూ కాశ్మీర్ లో 370కి వ్యతిరేకంగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాం.. దాన్ని రద్దు చేసుకొని భారత రాజ్యాంగం పరిధిలోకి తీసుకురావటం కీలక ఘట్టమని తెలిపారు.
తన జీవితంలో ఇది కీలక నిర్ణయమని వెల్లడించారు. కేబినెట్ మంత్రిగా తనకు మోడీ అవకాశం కల్పించారని.. ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా ప్రోత్సాహిస్తున్నామని.. కోవిడ్ కారణంగా దేశానికి పర్యాటకులు విదేశాల నుంచి రాలేదు, జిడిపి 5 శాతం మాత్రమే పర్యాటకం నుంచి ఉంటుందని వివరించారు. మన దేశంలో పర్యాటక రంగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని... జనవరి నుంచి మళ్ళీ పర్యాటకం ప్రారంభిస్తామన్నారు. మన దేశంలో అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయని.. ఈశాన్య రాష్ట్రాల్లో న్యూజిలాండ్ లాంటి సుందర ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు.
డిసెంబర్ లోపు కరోనా వ్యాక్సినేషన్ చాలా వరకు పూర్తి అవుతుందన్నారు. మన రాష్ట్రంలో బతుకమ్మ, గిరిజన పండగలు, సమ్మక్క సారక్క జాతరలను వచ్చే రెండేళ్లలో వాటిని చిత్రీకరించి టూరిజం స్పాట్ లుగా చేయనున్నామన్నారు. 40 యునెస్కో గుర్తింపు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, వాటిలో మౌలిక వసతులు కల్పించనున్నామని వివరించారు. ఆర్కియాలజీ కట్టడాలను వాటన్నిటినీ భద్రపరిచి భావితరాలకు తెలిసేలా కృషి చేస్తామని.. దేశంలో 3700 ల మాన్యుమెంట్స్ ఉన్నాయన్నారు.. భువనగిరి కోటకు ప్రత్యేక ఉందని.. రోప్ వే ద్వారా అభివృద్ధి చేయాల్సి ఉందని తెలిపారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అభివృద్ధి చేస్తామన్నారు.