హుజురాబాద్ లో రాజకీయమంతా చాలా రసవత్తరంగా సాగుతోంది. ఎలాగైనా హుజురాబాద్ లో విజయం సాధించాలని సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. దీనికోసమే సీఎం కేసీఆర్ అన్ని దారులను తనకు అనుగుణంగా మలుచుకుంటూ ముందుకు పోతున్నారని చెప్పవచ్చు. ఆయన లక్ష్యం హుజురాబాద్ ఎలక్షన్ లే కాకుండా రాబోవు 2023 లో కూడా తెరాస ప్రభుత్వాన్ని మళ్లీ గద్దెనేక్కించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. దీనికోసం హుజురాబాద్ నుంచే తన ఆలోచనలను పదును పెట్టారు. ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.
దీనిలో విజయం సాధించాలని అటు టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమదైన శైలిలో ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. కానీ ఇప్పటికే బిజెపి పార్టీ నేతగా ఈటల పోటీలో ఉంటారు. టిఆర్ఎస్ నుంచి ఎవరు ఉంటారనేది ఇప్పటికి డిసైడ్ కాలేదు. కాంగ్రెస్ అయితే దాని గురించి ఇంకా ఆలోచన పెట్టినట్లు కూడా లేదు. సీఎం కేసీఆర్ మాత్రం ఎలాగైనా హుజురాబాద్ లో విజయం సాధించాలని దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. దీని ద్వారా 50 శాతం దళితులు ఉన్నటువంటి హుజురాబాద్ లో ఓట్లు సాధించవచ్చని ఆలోచనతో కెసిఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. అటు రాజేందర్ పాదయాత్ర మొదలుపెట్టి కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ పాదయాత్రను మొదలు పెట్టాలా వద్దా అన్నదానిపై రెండు నుంచి మూడు రోజుల్లో తెలుస్తుంది.
టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో ఎలాగైనా విజయం సాధించాలని దాదాపు 150 కోట్లకు పైగా ఖర్చు చేసిందని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. ఇదంతా ఆర్థిక మంత్రి హరీష్ రావు కనుసన్నల్లోనే సాగుతుందని, ఆయన అన్నారు. డబ్బుతో హుజురాబాద్ ప్రజల్ని కొనలేరని ఈటల రాజేందర్ తెలిపారు. దళిత కుటుంబీకులకు 10 లక్షల రూపాయలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం అని, కానీ ఈ పథకాన్ని తెలంగాణ మొత్తం దళిత కుటుంబాలకు అందించాలని అన్నారు. నేను డ్రామాలు ఆడనని, సీరియస్ రాజకీయం చేస్తానని, హుజురాబాద్ ఉప ఎన్నికల అప్పుడు మాత్రమే సీఎం కేసీఆర్ కి హామీలు గుర్తుకు వచ్చాయా అని ఎద్దేవా చేశారు. అలాగే నిరుద్యోగ భృతి ని కూడా అమలు చేయాలని కోరారు.