ఓ నాన్నా.. పదవీ నాదే బాధ్యతా నాదే
ప్రాంతీయ పార్టీలలో కథ నడిపే వారసులు జాతీయ పార్టీలతో జతగడితే ఎందుకనో పెద్దగా ప్రభావం చూపలేరు. కానీ పదవుల వరకూ తమ ప్రాభవానికి, స్థానిక నాయకత్వ బలోపేతానికి వీరు సరిపోయినా, ఢిల్లీలో ప్రాంత ప్రయోజనాల కొట్లాటలో పెద్దగా రాణించింది లేదు.. కనుక కొత్తగా పదవులు అందుకున్న వారు సొంత ప్రయోజనాల కోసం కాక ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలి. ఆ దిశగా బొమ్మై ఉంటారో లేదో! అన్నది తేలాలిక
దేశ రాజకీయాలలో వారసుల జాబితా పెరిగి పోతోంది. తాజాగా బసవరాజు బొమ్మై కూడా చేరారు. ఆయన తండ్రి ఎస్ ఆర్ బొమ్మై కర్ణాటక సీఎంగా చేసిన సంగతి విధితమే! వారసత్వ రాజకీయాలు మంచివా కావా అన్నది ఇలాంటి తరుణాన చర్చకు రావాల్సిన అంశం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్, అదేవిధంగా దేవేగౌడ కుమారుడు కుమార స్వామి, కరుణానిధి కుమారుడు స్టాలిన్ దక్షిణాది రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. వీరి సామర్థ్యం సుదీర్ఘ ప్రస్థానం కారణంగానే వీరికి పదవులు దక్కవచ్చు గాక, అ ధికారం చేజిక్కవచ్చు గాక అంతేకానీ కేవలం ఫలానా వారి వారసులు అయినంత మాత్రాన సీఎం కుర్చీ వరించిందని చెప్పలేం. రా జశేఖర్ రెడ్డి మరణించిన దాదాపు పదేళ్లకు జగన్ కు పదవి దక్కగా, కరుణానిధి మరణించిన దాదాపు మూడేళ్లకు స్టాలిన్ సీఎంగా పగ్గాలు అందుకున్నారు. అదేవిధంగా పార్టీపై కూడా తిరుగులేని పట్టు తెచ్చుకున్నారు. ఇక కుమార స్వామి కూడా నాన్న అడుగు జాడల్లో నడిచిన సీఎం అయినా పెద్దగా ప్రభావం చూపని నాయకుడిగానే మిగిలిపోయారు. ఉత్తరాదిలో కూడా ఇలాంటి తరహా రాజకీయాలే నడుస్తున్నాయి. అయితే వీళ్లలో ప్రజలను ఆకర్షించే గుణం, పాలనను సజావుగా నడిపే లక్షణం ఎలా ఉంది అన్నదే కీలకం. పాదయాత్ర చేసి పదవుల్లోకి వచ్చినా, అధిష్టానం ఆశీర్వాదంతో వచ్చినా నిలదొక్కుకున్నారా లేదా అన్నదే ముఖ్యం. ప్రాంతీయ పార్టీల హవా విపరీతంగా ఉన్న దక్షిణాదిలో బీజేపీ పాగా వేసేందుకు చేసినా లేదా చేస్తున్న ప్రయత్నాలు ఓ విధంగా సఫలీకృతం అయ్యేందుకు ఇటువంటి వారసులు ఉపయోగపడతారా లేదా అన్నది బొమ్మై విషయంలో తేలాల్సిన పరిణామం.