భారత్ లో గత 24గంటల్లో 17లక్షల 18వేల 756కరోనా టెస్టులు చేస్తే.. 39వేల 742కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనాతో 535మంది చనిపోయారు. ఇప్పటి వరకు 4లక్షల 20వేల 551మంది ప్రాణాలు వదిలారు. గత 24గంటల్లో 39వేల 972మంది కరోనాను జయించారు. మొత్తం 3కోట్ల 5లక్షల 43వేల 138మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4లక్షల 8వేల 212యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా 43.31కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర వస్తువులైన పల్స్ ఆక్సీమీటర్, బీపీ మిషన్, డిజిటల్ థర్మామీటర్ లాంటి ఐదు వైద్య పరికరాల ధరలు బాగా తగ్గాయి. ట్రేడ్ మార్జిన్ పై ఆంక్షలు విధించడంతో.. వస్తువుపై 47నుంచి 88శాతం వరకు తగ్గింపు లభించినట్టు తెలిపింది. సవరించిన ధరలు జులై 20నుంచి అమల్లోకి వచ్చాయని.. తాజా రేట్లు అన్ని బ్రాండ్లకు వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. కొత్త ధరలు అమలయ్యేలా చూడాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది.
భారత్ 200టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ బంగ్లాదేశ్ కు సరఫరా చేస్తోంది. భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు 10కంటైనర్లతో ఝార్ఖండ్ లోని టాటా నగర్ నుంచి బయలుదేరింది. ఇది బంగ్లాదేశ్ లోని బేనాపోల్ వరకు వెళ్లనుంది. పొరుగుదేశానికి రైలు ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయడం ఇదే తొలిసారి. ఈ రైళ్లను ఏప్రిల్ 24, 2021న ప్రారంభించారు. దేశంలో 480ఆక్సిజన్ రైళ్లు నడుస్తున్నాయి.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ప్రజారవాణా వ్యవస్థలో ఆంక్షలను ప్రభుత్వం కొంతమేర ఎత్తివేసింది. మెట్రో, బస్సుల్లో 100శాతం సీటింగ్ కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. థియేటర్లు, మల్టీప్లెక్స్ లలో 50శాతం సీటింగ్ కు అనుమతి ఇచ్చింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు గరిష్టంగా 100మందికి అనుమతి ఇవ్వగా.. ఈ నెల 26నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.