ఆ మంత్రిని టార్గెట్ చేసిన జనసేన..టీడీపీ కలిసొస్తే చెక్ పెట్టొచ్చా?
ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ని జనసేన గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఆయనపై నిత్యం ఏదొకరకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జనసేన నాయకుడు పోతిన మహేష్..వెల్లంపల్లిపై గట్టిగానే విరుచుకుపడుతున్నారు. దేవాదాయ శాఖలో వెల్లంపల్లి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అటు డబ్బులు తీసుకుని మరీ వెల్లంపల్లి దేవాలయాల్లో ఇటీవల పారిశుధ్య కార్మికులని నియమించారని జనసేన విమర్శలు చేస్తుంది.
అయితే వెల్లంపల్లిని ఈ రేంజ్లో జనసేన టార్గెట్ చేయడానికి కారణాలు లేకపోలేదు. గతంలో వెల్లంపల్లి ప్రజారాజ్యంలో పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి విజయవాడ వెస్ట్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2014లో బీజేపీ తరుపున నిలబడి ఓడిపోయారు. కాకపోతే అప్పుడు టీడీపీ-బీజేపీలకు పవన్ కల్యాణ్ సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు విజయవాడ ప్రచారానికి వచ్చిన పవన్తో వెల్లంపల్లి సన్నిహితంగా మెలిగారు.
ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున నిలబడి విజయం సాధించి, మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రి అయ్యాక వెల్లంపల్లి, ఏ స్థాయిలో పవన్ని విమర్శిస్తున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. అందుకే జనసైనికులు వెల్లంపల్లిని బాగా టార్గెట్ చేశారు. ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో వెల్లంపల్లికి చెక్ పెట్టాలని చూస్తున్నారు.
కానీ వెల్లంపల్లికి చెక్ పెట్టాలంటే జనసేన వల్ల కాదు. టీడీపీ కూడా కలిస్తేనే అది సాధ్యం అవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీపై 7 వేల ఓట్ల మెజారిటీతో వెల్లంపల్లి గెలిచారు. కానీ జనసేన నుంచి పోటీ చేసిన పోతిన మహేష్కు 22 వేల ఓట్లు వరకు పడ్డాయి. అదే అప్పుడు జనసేన-టీడీపీలు కలిసి బరిలో ఉంటే వెల్లంపల్లి గెలుపు సాధ్యం అయ్యేది కాదు. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీతో కలిస్తేనే జనసేన, వెల్లంపల్లికి చెక్ పెట్టగలదని చెప్పొచ్చు. లేదంటే ఇలా వెల్లంపల్లిపై విమర్శలు చేయడం వరకే పరిమితం కావొచ్చు. మరి చూడాలి నెక్స్ట్ జనసేన వ్యూహాలు ఎలా ఉంటాయో?