కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఇంతేనా..?

దేశంలో సుదీర్ఘ‌కాలం అధికారంలో ఉండి, రాజ‌కీయాల‌ను శాసించిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుతం ఎన్న‌డూ లేనంత గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఏపీలో 2014 వ‌ర‌కు అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత‌ ఉనికి నామ‌మాత్రంగా మిగిలింది. ఆ పార్టీలోని ప‌లువురు ప్ర‌ముఖ నాయ‌కులు అటు బీజేపీలోకో, ఇటు వైసీపీలోకో చేరిపోవ‌డంతో మిగిలిన కొద్దిమంది నాయ‌కులు పార్టీతోపాటు త‌మ మ‌నుగ‌డ కోసం పోరాటం చేస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాజ‌కీయ వేడి పుట్టిస్తున్న‌ తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో పార్టీ ఉనికిని గ‌ట్టిగా చాటేందుకు కాంగ్రెస్ నేత‌, సీనియ‌ర్ నాయ‌కుడు.. చింతా మోహ‌న్‌.. ఒంట‌రి పోరు చేస్తున్నారు. వాస్త‌వానికి ఆయ‌న ఆ రిజ‌ర్వుడు స్థానం నుంచి గ‌తంలో ఆరుసార్లు విజ‌యం సాధించి సుదీర్థ‌కాలం ప్రాతినిధ్యం వ‌హిస్తూవ‌చ్చారు. స‌హ‌జంగానే స్థానికంగా ఆయ‌న‌కున్న‌ ప‌లుకుబ‌డి, ఆ ప్రాంత రాజ‌కీయాల‌పై ఉన్న ప‌ట్టు వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తే..  ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంది. అంతేకాదు.. ఇటీవలి కాలంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను కూడా టార్గెట్ చేసుకుని కామెంట్లు చేసి పార్టీ క్యాడ‌ర్‌లో జోష్ నింపారు. సోష‌ల్ మీడియాలోనూ ఆయ‌న‌కు ఫాలోవ‌ర్ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలోనే  పార్టీ ప‌రువు నిలిపై బాధ్య‌త‌ను ఆయ‌నపైనే ఉంచి తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిలిపింది అధిష్ఠానం.  తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి మొత్తం తొమి‌ది సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచిన ఆయ‌న ఇప్పుడు పదోసారి పోటీలో నిలుస్తున్నారు. అయితే పార్టీ క్యాడ‌ర్ గ‌తంలోనే చాలావ‌ర‌కు వైసీపీలో చేరిపోవ‌డంతో క్షేత్ర‌స్థాయి నాయ‌క‌త్వంలో చురుకు క‌నిపించ‌డం లేదు. ప్ర‌చారానికి గ‌డువు ముగియ‌వస్తున్న‌ నేప‌థ్యంలో ఇప్పుడు ఏవిధంగా ముందుకు సాగాలి.. ఎలాంటి వ్యూహాల‌తో వైసీపీకి చెక్ పెట్టాల‌నే కార్యాచ‌ర‌ణ‌ కాంగ్రెస్‌లో కొర‌వ‌డింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కేవ‌లం అభ్య‌ర్థి చింతామోహ‌న్ ఒంట‌రి పోరాటం చేస్తూ తాను కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని మ‌రీ ప్ర‌చారం చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వంతోపాటు ఇత‌ర నాయ‌కులు పెద్ద‌గా ప్ర‌చార బాధ్య‌త‌లు తీసుకోక‌పోవ‌డంపై చింతామోహ‌న్ తో పాటు స్థానిక నాయ‌కుల నుంచి అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌రోవైపు వైసీపీకి పోటీగా ప్రధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న‌ టీడీపీ త‌న‌దైన శైలిలో దూకుడుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. ఇక్క‌డ గ‌తంలో ఆ పార్టీకి పెద్ద‌గా గెలిచిన చ‌రిత్ర లేదు. అధికార వైసీపీ నేత‌లు కూడా విజ‌యంపై స‌ర్వ‌శ‌క్తులు వినియోగిస్తూ భారీస్థాయిలో ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో చింతాకు కొంత ఇమేజ్ ఉన్నా.. మంచి అవ‌కాశం ఉండి కూడా కాంగ్రెస్ నేత‌లు వినియోగించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఒక‌రకంగా  గ‌ట్టి పోటీ ఇచ్చినా కాంగ్రెస్ క్యాడ‌ర్‌లో ఉత్సాహం నింప‌వ‌చ్చ‌ని అదికూడా చేయ‌లేక‌పోతే పార్టీకి మ‌రింత కష్ట‌కాల‌మేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: