అచ్చెన్నాయుడు ఎత్తుగడతో వైసీపీకి కస్టాలు తప్పవా...?

VAMSI
ఏపీలో మరో సమరానికి రంగం సిద్ధమైంది. తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో ఖాళీ అయిన ఆ సీటుకు ఉప ఎన్నికను జరపనున్నారు. నిన్ననే ఉప ఎన్నికలు నామినేషన్ పూర్తయింది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పాల్గొంటున్న అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచేందుకు అన్ని రకాలుగా సమాయత్తమవుతున్నారు. దొరికన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఎప్పటి లాగే ఈ ఎన్నికల్లో కూడా గెలుపు మాదే అంటూ అధికార వైసీపీ ప్రగల్భాలు పలుకుతోంది. ఇక ప్రతిపక్ష టిడిపి మరియు బీజేపీ జనసేన ల కూటమి సైతం మంచి ప్రణాళికతో ఎన్నికకు వెళుతోంది. బీజేపీ అభ్యర్థి అయిన రత్న ప్రభ విషయంలో గతంలో జరిగిన విషయాలు కొన్ని ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశం ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందో చెప్పలేని పరిస్థితి.

అయితే టీడీపీ తాజాగా ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. వైసీపీ వారు ఎలాగైతే స్థానిక ఎన్నికలలో దౌర్జన్యంగా గెలిచారో...ప్రస్తుతం ఎంపీ ఉప ఎన్నికలోనూ అదే తీరుగా ప్రవర్తిస్తున్నారని స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి జగన్ ఏకంగా వాలంటీర్లనే ఇంటింటికీ పంపించి ఓటర్లను బెదిరిస్తున్నారంట, అంతే కాకుండా వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వం నుండి వారికి రావలసిన పథకాలన్నింటినీ రద్దు చేస్తామని చెబుతూ ప్రచారం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపిస్తున్నారు. దీనికి ఆయన ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఎవరైనా ఈ విధంగా చెప్పి మిమ్మల్ని బెదిరిస్తే...మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరికీ ప్రభుత్వం నుండి వచ్చే పధకాన్ని రద్దు చేసే అధికారం లేదు. పధకాల ద్వారా ఇచ్చే డబ్బు జగన్ తండ్రి డబ్బులో లేదా వారి తాత డబ్బులో కావు...అవి ప్రజల డబ్బులే అని ఈ సందర్భంగా తెలిపారు. జగన్ ప్రజలకు పధకాల రూపంలో 10 పైసలు ఇచ్చి, 90 పైసలు దోచుకుంటున్నారు...ఈ ఎన్నికలో వీరికి సరైన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చాడు.

వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి ప్రలోభాలకు గురిచేస్తే ఈ నెంబర్ 7557557744 కు వారి ఫోటోను మరియు ఆ వాయిస్ రికార్డు కానీ లేదా వీడియోను కానీ నాకు వాట్సాప్ చెయ్యండి. ఇలా చేసిన వారి అకౌంట్ లో వెంటనే 10,000 రూపాయలు జమ అవుతాయి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు అచ్చెన్నాయుడు. ఈ ఆఫర్ తిరుపతి లోక్ సభ పరిధిలోని 7 నియోజకవర్గాలకు వర్తిస్తుందని తెలిపాడు. కాబట్టి ఓటర్లంతా టీడీపీ పక్షాన నిలబడి వారి ఆగడాలను అడ్డుకోవాలని అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే ఇది అంతా గమనిస్తున్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు టీడీపీ మంచి ఎత్తుగడ వేసిందని అభినందిస్తున్నారు. ఇలా ప్రజలు పంపిన ఫోటోలు మరియు వీడియోలను ఎప్పటికప్పుడు టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతుందని తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: