వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

VUYYURU SUBHASH
జ‌గ‌న్ కేబినెట్‌లో అనూహ్యంగా బెర్త్ ద‌క్కించుకున్న నాయ‌కుల్లో వెలంప‌ల్లి శ్రీనివాస్ ఒక‌రు. సంస్థా గ‌తంగా పార్టీలో ఎంద‌రో ఉన్నా.. వారంద‌రినీ కాద‌ని.. 2019 ఎన్నిక‌ల‌కు రెండు సంవ‌త్స‌రాల ముందు వైసీపీలోకి వ‌చ్చిన వెలంప‌ల్లికి జ‌గ‌న్ ఏరికోరి కేబినెట్లో ప‌ద‌విని అప్ప‌గించారు. అయితే.. ఆయ‌న ఏ ముహూర్తంలో మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారోకానీ, ఆయ‌న ప‌ద‌వి చేప‌ట్టిన నాటి నుంచి కూడా ఆయ‌న చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి. దేవ‌దాయ శాఖ మంత్రిగా ఉన్న వెలంప‌ల్లి శ్రీనివాస్‌.. ఆల‌యాల‌ను ఆదాయ మార్గాలుగా మార్చార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఆ త‌ర్వాత‌.. అధికారులు అవినీతికి పాల్ప‌డుతున్నా చూస్తూ ఊరుకున్నార‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపించాయి.

 ఇక‌, గ‌త ఐదారు మాసాల నుంచి మ‌రింత‌గా ఆయ‌నపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆల‌యాల‌పై దాడులు జ‌ర‌గ‌డం, వాటిని అడ్డుకోలేక పోవ‌డం.. నిర్ల‌క్ష్యంగా వ్యాఖ్య‌లు చేయ‌డం.. తాను దేవ‌దాయ శాఖ మంత్రిని అనే విషయాన్ని కూడా మ‌రిచిపోయిన స్థితిలో వ్యాఖ్య‌లు చేయ‌డం.. కేవలం.. జ‌గ‌న్‌ను పొగిడేందుకు మాత్ర‌మే త‌న‌కు ప‌ద‌వి ఇచ్చారా? అనే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి వెలంప‌ల్లిని పాయింట్ అవుట్ చేశాయి. ఇక‌, టీడీపీ నుంచి ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌ను వైసీపీలోకి తీసుకురావ‌డం మిన‌హా.. ఆయ‌న పార్టీకి చేసిన ప్ర‌యోజ‌నం ఏమీ క‌నిపించ‌డం లేదు. అయినా.. కూడా జ‌గ‌న్ కానీ, పార్టీలోని కీల‌క నేత‌లు కానీ.. వెలంప‌ల్లిని ఏమీ అన‌లేక పోతున్నార‌నే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

వాస్త‌వానికి అటు అంత‌ర్వేది ర‌థం ద‌గ్ఢం ఘ‌ట‌న కానీ, ఇటు రామ‌తీర్థం ఘ‌ట‌న కానీ.. అంత ఈజీగా జ‌రిగిన‌వి కావ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దేశంలోనే ఎంతో పేరెన్నిక‌గ‌న్న ఈ రెండు ఆలయాల్లోనూ ఇలాంటి అమానుషాలు జ‌రిగిన‌ప్పుడు కూడా వెలంప‌ల్లి చీమ‌కుట్టిన‌ట్టు కూడా స్పందించ‌లేక పోయారు. ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికే ఆయ‌న ప్రాధాన్యం ఇచ్చారు. వాస్త‌వాల‌ను వెలికీ తీసేందుకు కానీ.. త‌న వంతుగా వాటి విష‌యంలో ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇచ్చేందుకు కానీ.. వెలంప‌ల్లి ప్ర‌య త్నించ‌లేక పోయారు.

ఫ‌లితంగా ఇప్పుడు అన్ని వేళ్లూ.. వెలంప‌ల్లి వైపే చూపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎవ‌రు గొంతు విప్పినా.. వెలంప‌ల్లి రాజీనామాకు ప‌ట్టుబ‌డుతున్నారు. నిజానికి ఆదిలో వెలుగు చూసిన‌.. ఘ‌ట‌న‌ల్లోనే మంత్రి వెలంప‌ల్లి సీరియ‌స్‌గా స్పందించి ఉంటే.. ఇప్పుడు ప‌రిస్థితి వేరేగా ఉండేది. కానీ.. ఆయ‌న వ్య‌వ‌హారంతో ఆయ‌న ప‌ద‌వికే గండం వ‌చ్చే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: