ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడిపి గ్రామంలో సాక్షి దినపత్రిక ప్రతుల్ని దహనం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాక్షి పత్రిక ప్రతులను తగలబెడతారా అంటూ లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికలపై గౌరవం ఉన్న వారు ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని, నీలా ఆలోచిస్తే మా ప్రభుత్వం పై తప్పుడు కథనాలు రాస్తున్న మీ పచ్చ పత్రికలను మేమేం చేయాలి అంటూ సురేష్ ప్రశ్నించారు.మీ పత్రికలో రాసిన మేడిపి గ్రామ వాసులు రేగుల కాశయ్య, అనురాధ కుటుంబానికి వివిధ పథకాల ద్వారా రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు అందాయని లెక్కలతో సహా సురేష్ వివరించారు.
అమ్మ ఒడి రాలేదని రాసిన రేగుల అనురాధ ఖాతాలు గతం ఏడాది 15000 జమ అయిందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా
లోకేష్ ఈ విధంగా వ్యవహరించడం పై
మంత్రి సురేష్ మండిపడ్డారు. నిన్ను చూసి ప్రజాస్వామ్యవాదులు సిగ్గుపడాలని
తెలుగుదేశం పార్టీ తలదించుకోవాలని అన్నారు . ప్రజాస్వామ్యం అన్నా, దానికి మూలస్తంభాలు లాంటి పత్రికల్లో అన్నా, కొంచెం కూడా గౌరవం ఉందా ? ఉంటే ఇలా చేస్తాడా ? నిజాలు తనకు నచ్చనంత మాత్రాన, ఏకంగా పత్రిక ప్రతులను తగలబెట్టడం వంటివి చేసాడంటే , రాజకీయాలకు పనికి వస్తాడా అంటూ ప్రశ్నించారు. అధికారం లేదని ఈ విధంగా కుట్రలు పన్నుతున్నారు అంటూ
లోకేష్ తీరుపై
మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రస్థాయిలో మండిపడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.