జేసీ వారసుడు దూకుడు...తాడిపత్రిలో పట్టు దక్కుతుందా?

M N Amaleswara rao
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం జేసీ ఫ్యామిలీ కంచుకోట అనే విషయం తెలిసిందే. ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి తిరుగులేని విజయాలు సాధించారు. తెలుగుదేశం హవా ఉన్న సమయాల్లో సైతం కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. వరుసగా 1985, 1989, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలోకి వచ్చేశారు. 2014 ఎన్నికల్లో దివాకర్ అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలవగా, దివాకర్ సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి విజయం సాధించారు.

అయితే 2019 ఎన్నికల్లో జేసీ ఫ్యామిలీకి ఊహించని షాక్ తగిలింది. అనంతపురం ఎంపీ స్థానం నుంచి దివాకర్ తనయుడు పవన్ ఓటమి పాలవ్వగా, తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి ప్రభాకర్ తనయుడు అస్మిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతపురం పార్లమెంట్ స్థానం గురించి వదిలేస్తే జేసీ ఫ్యామిలీ అడ్డా అయిన తాడిపత్రిలో ఓడిపోవడం ఆ ఫ్యామిలీకి గట్టి షాక్ తగినట్లైంది.

జగన్ వేవ్‌లో జేసీ ఫ్యామిలీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఓడిపోయాక కొన్నిరోజులు జేసీ ఫ్యామిలీ రాజకీయాల్లో కనిపించలేదు. అప్పుడప్పుడు దివాకర్ మీడియా సమావేశాల్లో కనిపించడం తప్పా, మిగతవారు కనబడలేదు. అయితే అనూహ్యంగా ప్రభాకర్, ఆయన తనయుడు అస్మిత్ నకిలీ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో జైలుకు వెళ్ళి బెయిల్ మీద వచ్చాక ఫుల్ యాక్టివ్ అయ్యారు.

జగన్ ప్రభుత్వం కావాలనే కేసులు పెట్టి జైలుకు పంపించిందని జేసీ ఫ్యామిలీ విమర్శలు చేస్తూ వచ్చింది. అలాగే మళ్ళీ తాడిపత్రిలో పాగా వేయాలనే దిశగా అస్మిత్ రెడ్డి పనిచేస్తున్నారు. తాజాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల విషయంలో అస్మిత్ పోరాటం చేస్తున్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కాకుండా వైసీపీ నాయకులకే కేటాయిస్తున్నారని అస్మిత్ ఫైర్ అవుతున్నారు. తాడిపత్రిలో లబ్దిదారులకు న్యాయం జరిగేలా పోరాటం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికైతే తాడిపత్రిలో పట్టు దక్కించుకునేందుకు జేసీ వారసుడు దూకుడు పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: