ఎంఐఎం ప్లాన్స్ సక్సెస్.. గెలుపుతో మరింత ఉత్తేజం..!
ఆలిండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ - mim పార్టీ.. మొన్నటి వరకూ హైదరాబాద్ పాతబస్తీకే పరిమితం.. గట్టిగా చూస్తే ఓ ఎంపీ, ఏడు అసెంబ్లీస్థానాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీ. దశాబ్దాల తరబడి, ఎంఐఎం ప్రాతినిద్యం అలానే సాగింది. అయితే , దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని.. ఆపార్టీ అదినాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది.దీనిలో భాగంగా తెలుగురాష్ట్రాల్లోనూ.. ముస్లిం జనాభా అధికంగా ఉండే చోట పోటీ చేస్తూ, గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ మినహాయిస్తే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో పోటీ చేస్తూ వస్తోంది.
దశాబ్దకాలంగా జాతీయస్థాయిలో కూడా సత్తా చాటాలని mim నిర్ణయించింది. ముందుగా 2014 ఎన్నికల్లో మహారాష్ట్ర శాశనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం.. రెండు ఎమ్మెల్యే సీట్లను దక్కించుకుంది.2019 ఎన్నికల్లో ఓ లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచింది.
బీహార్ ఎన్నికల్లో సొంతంగా పోటీచేసిన ఎంఐఎం.. చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించింది. ఏకంగా ఐదు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. ఓ వర్గం ఓట్లపైనే ప్రధానంగా ఆధారపడి పోటీచేస్తున్న ఎంఐఎం.. నెమ్మదిగా.. తన ప్రభావాన్ని చూపిస్తూ.. ముందుకు సాగుతోంది. ఒక్కో రాష్ట్రానికి విస్తరిస్తూ.. తన సత్తా చాటుతోంది. మున్ముందు పార్టీని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు వ్యూహాలు సిద్ధంచేస్తోంది.
మొత్తానికి ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా తమ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకే ఎన్నికల బరిలోకి దిగిన ఆపార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలను మూటగట్టుకుంటోంది. తాజాగా జరిగిన బీహార్ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచి తమ పవర్ ఏంటో చూపించింది.