సీఎం జగన్ పై ఏపీ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందా..?

Reddy P Rajasekhar
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తైంది. సీఎం జగన్ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. నవరత్నాలనే మేనిఫెస్టోగా ప్రకటించి జగన్ అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 90 శాతం హామీల అమలు ఇప్పటికే పూర్తైంది. మిగిలిన 10 శాతం హామీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి కూడా పెద్దగా ఫిర్యాదులు లేవు.
 
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతున్నాయి. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని తగ్గింది. జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై కూడా ప్రజల్లో మద్దతు ఉంది. మూడు రాజధానుల వల్ల రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
 
అయితే అమరావతి రైతుల విషయంలో మాత్రం ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు, ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమరావతి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుందనే విషయాలను చెప్పడం లేదని... భూములు ఇచ్చిన రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అమరావతి విషయంలో జగన్ సర్కార్ పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
 
అమరావతి తరలింపు వల్ల ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అమరావతి అభివృద్ధి కోసం జగన్ సర్కార్ ఏ విధంగా ముందుకెళ్లనుందో చెప్పాల్సి ఉంది. జగన్ సర్కార్ ఈ విధంగా చేయకపోతే రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వంగా అధికార పార్టీకి పేరు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జగన్ సర్కార్ కు పెద్దగా నష్టం లేకపోయినా భవిష్యత్తులో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఏపీలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం వల్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత పెరుగుతుండటం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: