చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా... ఒకేరోజు 100కు పైగా కేసులు నమోదు....?

Reddy P Rajasekhar
చైనా దేశంలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తోంది. కరోనా దాటికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. మన దేశంలో ప్రతిరోజూ 48,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్, మందులు అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే వైరస్ కు పుట్టినిల్లైన చైనాలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
 
డ్రాగన్ లో గత కొన్ని రోజులుగా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా ఒకేరోజు 100కు పైగా కేసులు నమోదు కాగా ఈ కేసులలో 89 కేసులు షిన్ జియాంగ్ ప్రాంతంలోనే నమోదు కావడం గమనార్హం. గడిచిన 90 రోజుల్లో చైనాలో ఇంత భారీగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి నాటికి చైనాలో వైరస్ వ్యాప్తి తగ్గగా ఏప్రిల్ నెల 13వ తేదీన 108 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతరం కరోనా కేసులు నమోదైనా తక్కువగానే నమోదయ్యాయి.
 
చైనాలోని పలు ప్రాంతాల్లో గత ఐదు నెలలుగా కరోనా కేసులు అక్కడక్కడా నమోదవుతూనే ఉన్నాయి. చైనా ప్రభుత్వం కేసులు నమోదైన ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. అదే సమయంలో భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపి వైరస్ వ్యాప్తి జరగకుండా చర్యలు చేపడుతోంది. చైనా మీడియా రాజధాని బీజింగ్ లోనే డ్రాగన్ పది లక్షల పరీక్షలు నిర్వహించినట్టు చెబుతోంది.
 
ఝావోలైన్, డావోలిన్ నగరాల్లో మూడు మిలియన్ల పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. చైనాలో ఇప్పటివరకు కేవలం 84,060 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,634 మంది మృతి చెందారు. కరోనాను కట్టడి చేయడంలో సఫలమైన చైనా ఆ రహస్యాలను ఇతర దేశాలతో పంచుకోవడానికి ఇష్టపడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోటీ 67 లక్షల మంది ఇప్పటివరకు కరోనా భారీన పడగా 6,60,000 మంది మృతి చెందారు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: