ఏపీ ప్రజలపై సీఎం జగన్ వరాల జల్లు.... రాష్ట్రంలో మరో రెండు కొత్త పథకాల అమలు...?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఎన్నికల ముందు జగన్ మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నారు. ఎన్నికల ముందు సీఎం జగన్ 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఒక సందర్భంలో చెప్పారు. ఆ హామీకి న్యాయపరమైన చిక్కులు వస్తాయని.... సాధ్యం కాని హామీ అని విమర్శలు వ్యక్తమయ్యాయి. అనంతరం జగన్ ఈ పెన్షన్ పథకాన్ని మరో పేరుతో అమలు చేస్తానని జగన్ చెప్పారు.
రాష్ట్రంలో అగ్రవర్ణాలు వినహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు తాజాగా ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 45 - 60 ఏళ్ల లోపు వయస్సు మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. వీరికి నాలుగేళ్ల పాటు 75,000 రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం తరపున అందనుంది. ప్రతి సంవత్సరం 18,142 రూపాయల చొప్పున ప్రభుత్వం అర్హులైన వారి ఖాతాలలో నగదు జమ చేయనుంది.
వైయస్సార్ చేయూత పేరుతో ఆగష్టు 12న ఈ పథకం అమలు కానుంది. ప్రభుత్వం రాష్ట్రంలో 24 లక్షల నుంచి 26 లక్షల మంది లబ్ధిదారులు ఉండవచ్చని అంచనా వేస్తోంది. జగనన్న తోడు పథకం పేరుతో చిరు వ్యాపారులకు ప్రభుత్వం 10,000 రూపాయల వడ్డీ లేని రుణం అందించనుంది. చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళ్లలపై ఆధారపడేవారు, తలపై బుట్టలు పెట్టుకుని అమ్మేవారికి ప్రభుత్వం ఈ పథకం అమలు చేయనుంది.
అక్టోబర్ నెల నుండి ఈ పథకం అమలు కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 9 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైయస్సార్ సంపూర్ణ పోషణ పేరుతో గర్భవతులు, తల్లులు, పిల్లల పౌష్టికాహారం కోసం 1863.11 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయనుంది. ప్రభుత్వం ఇళ్లు ఇచ్చిన తర్వాత ఆ ఇంటిలో 5 ఏళ్లపాటు నివాసం ఉన్న తర్వాతనే ఆ ఇల్లు అమ్ముకునేలా ఆదేశాలు జారీ చేసింది. జగన్ సర్కార్ రాష్ట్రంలోని ప్రజలపై వరాల జల్లు కురిపించింది.