ఏపీ రాజకీయాలను కుమ్మేస్తోన్న కరోనా... పార్టీలు, నేతల మధ్య చిచ్చు పెట్టేసిందిగా...!
ఏపీ రాజకీయాలకు కరోనా వైరస్ కుమ్మేస్తోంది. ఈ కరోనా ఇప్పుడు ప్రపంచం దూకుడుకే బ్రేకులు వేసింది. ఇక ఏపీ రాజకీయాలను శాసించడం పెద్ద లెక్కేం కాదు. ఇక ఇప్పుడు ఈసీ అయితే స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా నేపథ్యంలోనే వాయిదా వేశానని చెపుతున్నారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. అదే టైంలో అధికార వైసీపీ మాత్రం దీనిని తీవ్రంగా తప్పు పడుతోంది. చివరకు ముఖ్యమంత్రి జగన్ సైతం గవర్నర్ను కలిసి ఈసీ తీరుపై ఫిర్యాదు చేయడం... చివరకు సీఎస్ ఎన్నికలు నిర్వహించాలని లేఖ రాయడం.. మంగళవారం ఉదయం సీఎస్ సైతం కరోనా వల్లే ఎన్నికలు వాయిదా వేశానని చెప్పడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో కరోనా ఏపీ రాజకీయాలను ఓ ఆటాడుకుంటోంది.
వాస్తవానికి నామినేషన్ల పర్వం ముగిసే సరికి వైసీపీ తిరుగులేని విధంగా ఏకగ్రీవ విజయాలతో దూసుకు పోతోంది. దీంతో సడెన్గా ఎన్నికలకు బ్రేక్ పడడం ఎవ్వరికి రుచించడం లేదు. కరోనా కేవలం సాకేనని, నిమ్మగడ్డ రమేష్ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ఎన్నికలను వాయిదా వేశారని జగన్ వ్యాఖ్యానించారు. అయితే, ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతుంటే, ఏపీ సీఎంకు మాత్రం అది చాలా చిన్న విషయంగా కనిపించడమేంటన్నారు చంద్రబాబు. ఇక ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ వాళ్లు కూడా ఇప్పుడు ఈ విషయంలో ఒక్కటి అయ్యారు.
ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వాయిదా వేయడం ప్రభుత్వానికే ఎటు చూసినా మైనస్. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు కావు. పైగా రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు బదిలీ చేశారు. ఇది జగన్కు పెద్ద ఎదురు దెబ్బే. ఇక టీడీపీ, ఇతర పార్టీలు మాత్రం ఎన్నికల వాయిదా వల్ల ఈ ఆరువారాల్లో కొంత అయినా కోలుకుంటామని భావిస్తున్నారు. ఇక సందట్లో సడేమియాలా ఎన్నికల వాయిదా అనేది తమ క్రెడిట్ అంటూ బీజేపీ - జనసేన కూటమి చెప్పుకుంటోంది. ఇక్కడ అన్యాయాలు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఎన్నికలు వాయిదా వేయించామని అంటున్నారు.
ఇక ఎన్నికల వాయిదాలో కేంద్ర పెద్దలూ వున్నారని, రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఇటు వైసీపీ వాళ్లు ముందుగా చంద్రబాబే ఎన్నికలు వాయిదా వేయించారని అంటుంటే... అటు విజయసాయి లాంటి వాళ్లు బీజేపీ, కన్నాను కూడా తిడుతున్నారు. ఇక జనసేన కూడా మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఏదేమైనా కరోనా ఏపీలో రాజకీయ పార్టీలు, నేతల మధ్య పెద్ద చిచ్చే పెట్టింది.