ఆరు దశాబ్దాల సీమ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టిన జగన్...!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని మార్పు అంశం తెరమీదకి వచ్చింది. అయితే ఈ క్రమంలోనే కర్నూల్ లో రాజధాని నిర్మాణం సహా హైకోర్టు నిర్మాణం జరగాలంటూ నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రజలతో పాటు న్యాయ వాదులు సైతం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా సీమాంధ్ర పరిస్థితి మాత్రం మారడం లేదని.. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలంటూ ప్రజలందరూ కోరారు. అయితే ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని మార్పు చేస్తామని తెలిపింది తప్ప ఎక్కడ నిర్మిస్తామని మాత్రం తెలుపలేదు.
ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రంలో ఎంతైనా అవసరం ఉందని... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానిలు రావచ్చేమో అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. కమిటీ ఇచ్చిన నివేదిక వారం రోజుల్లో ప్రభుత్వానికి అండుతుందని.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జుడిషియల్ క్యాపిటల్ అంటూ మూడు రాజధానిలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని జగన్ వ్యాఖ్యానించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్... అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో జుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
ఇకపోతే 1956లో సమైక్య ఆంధ్రప్రదేశ్ తొలి రాజధానిగా కర్నూలు ఉండేది ఆ తర్వాత ప్రాబల్యం కోల్పోవడంతో... రాష్ట్ర రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్ కు మార్చారు దీంతో సీమ ప్రాంతం మొత్తం అభివృద్ధిలో వెనుకబడి పోయింది. ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత సీమ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమకు ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థను ఇచ్చే యోచనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యం లోనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలు కూడా రాగా.. దీనికోసం కర్నూలు ప్రజలు న్యాయవాదులు కూడా నిరసనలు తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మారినా న్యాయం దొరకని రాయలసీమ ప్రజలకు హైకోర్టు ఏర్పటుతో న్యాయం చేసినట్లవుతుంది. దీంతో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజధాని అమరావతి లో కేవలం అసెంబ్లీ శాసనమండలి మాత్రమే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇక కర్నూలులో హైకోర్టు ఏర్పాటు నిర్ణయంతో ఆరు దశాబ్దాల నుండి అన్యాయానికి గురవుతున్న సీమ ప్రజల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిలబెట్టినట్లయింది .