బీజేపీలో చేరిన బిగ్ బాస్ కౌశల్... మరి టీడీపీ సంగతి?
కౌశల్. తెలుగు నటుడు. బిగ్బాస్ టు విజేత. బిగ్బాస్లో పాల్గొన్నప్పుడు ‘కౌశల్ ఆర్మీ’ పేరిట అభిమానులుఓ సోషల్ మీడియా ఎకౌంట్ను కూడా తెరిచారు . ఆయన గెలవాలని పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేపట్టారు. కౌశల్ని విన్నర్ చేయకపోతే బిగ్ బాస్ హౌస్కు నిప్పుపెడతామని కూడా బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. ఏదైతైనేం...ఆయన విజేతగా నిలిచాడు. బిగ్ బాస్కి ముందు కౌశల్ సీరియల్స్లో నటిస్తుండేవారు. బిగ్ బాస్లో అవకాశం రావడంతో సీరియల్స్కి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆ సెలబ్రిటీ రియాల్టీ షోలో విన్నర్ అయినా కూడా ఆయన మళ్లీ సీరియల్స్లోనే నటిస్తున్నారు. ఇలా కెరీర్ను టర్న్ తీసుకున్న కౌశల్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో...కౌశల్ బీజేపీలో చేరాడు. తన కూతురుతో కలిసి పార్టీ కండువా కప్పుకొన్నారు. రాయలసీమకు చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగానే కౌశల్ సైతం ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. కాగా, కౌశల్ రాజకీయ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే...ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేయటానికి కౌశల్ ఆసక్తిగా ఉన్నారని ప్రచారం జరిగింది.
ఎన్నికల సమయంలో కౌశల్ కేంద్రంగా కీలక పరిణామం జరిగింది. విశాఖ, అనకాపల్లి అభ్యర్ధుల ఎంపికపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో గంటా శ్రీనివాసరావు బిగ్ బాస్ కౌశల్ ను చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారు. కౌశల్తో సమావేశం సమయంలో ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న విషయంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. గంటా శ్రీనివాసరావు మాత్రం కౌశల్ను ఎన్నికల్లో విశాఖ జిల్లా నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దించాలని..అది పార్టీకి మేలు చేస్తుందని వివరించినట్లు వార్తలు వచ్చాయి. కౌశల్ సైతం టిడిపి తో కలిసి పని చేయటానికి సుముఖత వ్యక్తం చేశారని, ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారని పార్టీ నేతలు చెప్పారు. అయితే, తాజాగా కౌశల్ ఊహించని ట్విస్ట్ ఇస్తూ బీజేపీలో చేరారు.