జమ్ముకశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారతదేశానికి సంబంధించిన నిర్ణయాలు అయినప్పటికీ...పాకిస్తాన్ కలవరపాటుకు గురవుతోంది. కశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాక్ చర్యలకు దిగింది. భారత్తో వాణిజ్యాన్ని రద్దు చేసింది. భారత రాయబారిపై వేటు వేసింది. పాకిస్థాన్ థియేటర్లలో భారతీయ సినిమాలను ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ సహా ఏ భారతీయ సినిమా కూడా పాకిస్థాన్ లో ప్రదర్శించకూడదని … ఆ దేశ సమాచార ప్రసార శాఖ అధికారి, ప్రధానమంత్రి ప్రత్యేక సహాయకుడు ఫిర్దోస్ ఆషిక్ అవాన్ చెప్పారు.దీంతో భారత్ దిద్దుబాటు చర్యలకు దిగింది.
జమ్ముకశ్మీర్ విషయంలో ఇండియా తమతో సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుందని ఇది అక్కడి ప్రజల హక్కులను కాలరాయడమే అని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ఇండియాతో దౌత్యపరమైన సంప్రదింపులు ఉండవని తేల్చిన ప్రధాని కార్యాలయం.. తెగతెంపులకు సిద్ధపడింది. భారత్ నుంచి పాకిస్థాన్ హైకమిషనర్ ను వెనక్కి పిలిపించింది. భారత్ కూడా తమ రాయబారిని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే కోరింది. ఈ నిర్ణయాల వరుసలోనే భారతీయ సినిమాల ప్రదర్శనను కూడా పాకిస్థాన్ నిషేధించింది. బాలీవుడ్ సహా.. ఏ భారతీయ సినిమాను ప్రదర్శించినా చట్టప్రకారం శిక్షిస్తామని పాకిస్థాన్ హెచ్చరించింది.
ఇదిలాఉండగా,దౌత్య సంబంధాల అంశంపై పాకిస్థాన్ తన నిర్ణయాన్ని పునర్ సమీక్షించుకోవాలని భారత్ కోరింది. జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసమే తాము ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచదేశాల ముందు తమ సంబంధాలు బలహీనంగా ఉన్నాయని చెప్పడానికి పాక్ ఈ చర్యలకు దిగినట్లుగా కనిపిస్తోందని భారత్ అభిప్రాయపడింది. ఆర్టికల్ 370 రద్దు అనేది పూర్తిగా భారత్ నిర్ణయమని కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది.ఇదిలాఉండగా, సంఝౌతా ఎక్స్ప్రెస్ను పాకిస్థాన్ నిలిపివేసింది. ప్రయాణికులతో వస్తున్న రైలును వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ నిలిపివేసింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రైలు అలాగే నిలిచిఉంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.