అందరూ ఎంతో ఎదురు చూస్తున్న ఓట్ల పండగ రానే వచ్చింది. నేతల్లో ఉత్కంఠ..ఓటర్లలో ఉత్సాహం వెరసి నేడే పోలింగ్. మొన్నటి వరకు నేతల ఉపన్యాసాలు విన్నారు..నేడు వారి అంతిమ తీర్పు నిర్ణయించబోతున్నారు ఓటరు మహాశయులు. అయితే ఈసారి ఏపిలో పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటికే ఆయా పార్టీల ముఖ్య నేతలు గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సర్వేలు సైతం ఒక పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నాయి. ఇక దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాల్లో 91 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. నేడు ఏపీలో 25, తెలంగాణలో 17, యూపీలో 8, మహారాష్ట్రలో 7, అసోంలో 5, ఉత్తరాఖండ్లో 5, ఒడిశాలో 4, బీహార్లో 4, పశ్చిమబెంగాల్లో 2, అరుణాచల్ప్రదేశ్లో 2, చత్తీస్గఢ్లో 1, జమ్ముకశ్మీర్లో 2, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్, లక్షద్వీప్లలో ఒక్కో స్థానంలో పోలింగ్ జరగనుంది.
ఇక అసెంబ్లీ స్థానాలు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ బరిలో 2,118 మంది అభ్యర్థులున్నారు. 25 లోక్సభ స్థానాల్లో 319 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, బరిలో 443 మంది అభ్యర్థులున్నారు.
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.98 కోట్లు కాగా, వీరిలో మహిళా ఓటర్లు 1.98 కోట్ల మంది. పురుష ఓటర్లు 1.94 కోట్ల మంది. ఇక, తొలిసారి ఓటు వేయబోతున్న వారి సంఖ్య 10 లక్షలు. నేటి ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. నిజామాబాద్ లో 8 గంటలకు ప్రారంభమై..సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే పోలింగ్ ముగియనుంది.