ఎడిటోరియల్ : వంగవీటికి అంత సీన్ ఉందా ?

Vijaya

ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గం కేంద్రంగా రచ్చ జరగటం మామూలైపోయింది. ఎప్పటిలాగానే రాబోయే ఎన్నికలపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న రచ్చే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  సమస్యంతా వంగవీటి రాధాకృష్ణ కేంద్రంగానే జరుగుతుండటం విచిత్రంగా ఉంది. ఏ పార్టీలో ఉన్నా సెంట్రల్ నియోజకవర్గం నుండి తానే పోటీ చేయాలని గొడవ చేస్తుంటాడు. అలాంటి గొడవే ఇపుడు వైసిపిలో కూడా ఎక్కువైపోయింది. వంగవీటి రాధా మొదట కాంగ్రెస్ లో ఉన్నారు. తర్వాత ప్రజారాజ్యంపార్టీలోకి మారారు. ఇప్పటికైతే వైసిపిలో ఉన్నారు. రేపటి ఎన్నికల్లో టిడిపిలోకి దూకినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

 

ప్రతీ ఎన్నికకు ఏదో ఒకపార్టీ తరపున పోటీ చేస్తున్న రాధా దృష్టంతా ఇపుడు సెంట్రల్ నియోజకవర్గంపైనే ఉంది. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే తాను వైసిపిలో ఉండేది లేదని తాజాగా వైసిపి సీనియర్ నేత బొత్సా సత్యనారాయాణతో చెప్పారని ప్రచారం జరుగుతోంది. 20 ఏళ్ళ పొలిటికల్ కెరీర్ లో రాధా గెలిచింది 2004లో మాత్రమే. తర్వాత ఎప్పుడు పోటీ చేసినా ఓడిపోవటమే. గెలిచిన ఒకసారి కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండే. ఆ తర్వాత పోటీ చేసిన సెంట్రల్ నుండి మొన్నటి ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.

 

ఇక్కడే రాధా సామర్ద్యం మీద అందరికీ అనుమానం వస్తోంది. నిజానికి రాధా గెలిచిన ఒక్కసారి కూడా  తూర్పు నియోజకవర్గంలో 2004లో పోటీ చేసింది బిజెపి కాబట్టే రాధా గెలిచారు. అదే ఏ టిడిపినో పోటీ చేసుంటే ఏమయ్యేదో ? అంతటి ఘనచరిత్రున్న రాధా కూడా సెంట్రల్ నియోజకవర్గంలో తనకేదో తిరుగులేని ఇమేజి ఉన్నట్లు, పార్టీ ఏదైనా నామినేషన్ వేస్తే చాలు గెలిచేస్తున్నంతగా బిల్డప్ ఇస్తున్నారు.  రాధా వ్యవహారం చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే పద్దతిలో జరిగిపోతోంది. రంగా కొడుకు అనే తప్ప తనకంటూ వ్యక్తిగతంగా రాధాకు ఇమేజి ఉన్నట్లు కనిపించటం లేదు.

 

నిజంగానే రాధాకు అంత ఇమేజినే ఉంటే పోటీ చేసిన మూడు ఎన్నికల్లో రెండుసార్లు ఓడిపోయేవారేనా ? పైగా రంగా కొడుకన్న ఇమేజి కూడా రాధాను ఎన్నికల్లో గట్టెక్కించలేకపోతోందంటే  అర్ధమేంటి ? కాపుల కోసమే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారని అప్పట్లో విపరీతమైన ప్రచారం జరిగింది. మరి పిఆర్పీ తరపున పోటీ చేసినపుడు కూడా రాధా గెలవలేకపోయారంటే ఏమనర్ధం ? అంటే అటు కాపుల్లోనే కాకుండా ఇటు మామూలు జనాల్లో కూడా రాధాకు పెద్దగా పట్టు లేదన్న విషయం అర్ధమైపోతోంది. ఏదో పార్టీ గాలుంటే గెలవటం లేకపోతే చతికిల పడిపోవటమే.

 

రాజకీయంగా విజయవాడ తూర్పు కావచ్చు లేదా సెంట్రల్ నియోజకవర్గం కావచ్చు ఏమాత్రం పట్టులేని రాధా ఏ పార్టీలో ఉన్నా ఒకటే. కాబట్టి వైసిపిలో నుండి రాధా వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టమేంటి ? అంటే, ఏమీ లేదనే సమాధానం చెప్పుకోవాలి. పార్టీ మారవద్దని  రాధాను బ్రతిమలాడుకునే కొద్దీ రాధా అంత గొప్పోడు ఇంత గొప్పోడని ప్రచారం జరగటం, రాధా లేకపోతే వైసిపికి ఇబ్బందే అనే ప్రచారం జరగటం తప్ప ఉపయోగం ఏమీ లేదనే చెప్పుకోవాలి. రాధా కోరుకున్న చోట వైసిపి టిక్కెట్టిస్తుందా లేదా ? రాధా గెలుస్తాడా లేదా ? అన్నది వేరే విషయం. పార్టీని వీడొద్దంటూ బ్రతిమలాడుకునేంత సీన్ వంగవీటి రాధాకు ఉందా ? అన్నదే పాయింట్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: