ఆహా! అగ్బరుద్ధీన్ కలవకుంట్ల చంద్రునిపై ఎంత..ఎంత.. మమ..కారం?
కలవకుంట్ల చంద్రుని శక్తి, యుక్తి, వ్యూహాం వల్లే తెలంగాణ రాష్ట్రావిర్భావం జరిగిందని ఎంఐఎం ప్రముఖనేత, ఆ పార్టీ శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. శాసనసభ వేదికగా బుధవారం (నవంబర్ 8) ఆయన ముఖ్యమంత్రిపై ప్రశంసలు వెల్లువలా ప్రవహింపజేసారు. మైనార్టీల అంశంపై మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలను అక్బరుద్దీన్ పదే పదే గుర్తు చేశారు.
"కేసీఆర్ను కేవలం ముఖ్యమంత్రిగా గౌరవించడం లేదు. ఆయన్ని ముఖ్యమంత్రిగా మాత్రమే గుర్తిస్తే, దానికి గొప్పతనం ఆపా దించలేమని చాలా చిన్న విషయం అవుతుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ సాధించి పెట్టిన యోధానయోధుడా యన. తెలంగాణను ఎవరో ఇచ్చారని (కాంగ్రెసును ఉద్దేసించి)అనడం సరైంది కాదని, కేసీఆర్ అనుసరించిన వ్యూహాల వల్లే రాష్ట్రం ఆవిర్భవించిందని, మేం మద్దతిచ్చాం.. మేం మద్దతిచ్చాం.. (బాజపా-టిడిపి ఉద్దేసించి) అంటూ కొంత మంది పదే పదే చెప్పుకుంటుంటారు. కానీ, అసలు నిజం ఏంటంటే, వాళ్లు మద్దతు ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితిని చంద్రుడు కల్పించ టం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంను ఇచ్చి తీరాల్సిన పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారు" అని అక్బరుద్దీన్ ఉద్వేగంగా అన్నారు.
కులాలు, మతాలకు అతీతంగా, కేసీఆర్ అందరినీ సమానంగా చూస్తున్నారని అక్బరుద్దీన్ అన్నారు. పూజారులను ఎంత గౌరవిస్తారో అదే స్థాయిలో ముస్లిం, క్రిస్టియన్ల మత పెద్దలను కూడా కేసీఆర్ గౌరవిస్తారని ఆయన తెలిపారు. 2019లోనూ మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. తమ పార్టీ టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతిస్తుందని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
"ఉమ్మడి ఏపీలో మైనార్టీలు బడ్జెట్ కోసం పోరాటం చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ముస్లింల అభివృద్ధికి కేసీఆర్ తనంతట తానే పెద్దపీట వేస్తున్నారు. కేసీఆర్ వచ్చాకే ఫీజు రీ-ఇంబర్స్మెంట్ విషయంలో ముస్లిం విద్యార్థులకు న్యాయం జరిగింది. "షాదీ ముబారక్" ద్వారా పేదింటి యువతులకు ఎంతో మేలుజరుగుతోంది. 70 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు" అని అక్బరుద్దీన్ అన్నారు.
అయితే దీనిపై ప్రతిపక్షాలు మాత్రం "ఎంఐఎం పార్టీని ఇక టిఆరెస్ లో కలిపేస్తారేమో!" అని ఎద్దేవా చేస్తున్నారు.