హైదరాబాద్ : హైదరాబాద్ లో టెన్షన్ టెన్షన్

Vijaya


హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలతో నగరంలో టెన్షన్ పెరిగిపోతోంది. హైదరాబాద్ లో పట్టుబడ్డ ఉగ్రవాదులు చెప్పిన సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులే షాక్ కు గురయ్యారు. హైదరాబాద్ కు సమీపంలోని అనంతగిరి కొండల్లో గడచిన ఏడాదిన్నరగా ఉగ్రవాదులకు శిక్షణ జరుగుతున్నట్లు తెలుసుకుని పోలీసు ఉన్నతాధికారులు  ఆశ్చర్యపోయారు. ఏడాదిన్నరగా ఉగ్రవాద శిక్షణ జరుగుతున్నా బయటకు తెలీకపోవటం, పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టడలేకపోవటం నిజంగా పోలీసుల వైఫల్యమనే చెప్పాలి.



మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన ఒక ఉగ్రవాది మహమ్మద్ సలీల్ స్ధానికంగా ఉన్న వ్యాపారవేత్త సిఫారసుతో వైద్య కళాశాలలో నాలుగేళ్ళుగా లెక్చిరర్ గా ఉద్యోగం చేస్తున్న విషయమే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇలాంటి ఉద్యోగులు హైదరాబాద్ నగరంలో ఇంకా ఎంతమంది నివాసం ఉంటున్నారో అనే విషయమే పోలీసు ఉన్నతాధికారులను కలవరానికి గురిచేస్తోంది. పూర్తిస్ధాయిలో శిక్షణ తీసుకున్న తర్వాత అందరు కలిసి నగరంలోని ప్రముఖులతో పాటు షాపింగ్ మాల్సును టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారట.



ఇందులో భాగంగానే తుపాకులు పేల్చటం, బాంబులు తయారుచేయటం, వాటిని పేల్చటంలో చాలాకాలంగా శిక్షణ తీసుకుంటున్నారు. ఒక ఉగ్రవాది డాక్టర్ ముసుగులో ఉంటే మరికొందరు ఉగ్రవాదులు ఐటి ఉద్యోగుల ముసుగులో ఉన్నారు. దాదాపు ఏడుమంది ఉగ్రవాదులు హైదరాబాద్ లోని అనేక కంపెనీల్లో ఐటి ఉద్యోగులుగా చెలామణి అవుతున్నారు. ఐటి సెక్టార్లో ఇంకా ఎంతమంది ఇలాంటి ఉగ్రవాదులు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారనే విషయాన్ని ఆరాతీస్తున్నారు.



భోపాల్ లో దొరికిన సమాచారంతో అక్కడా యాంటీ టెర్రరిస్టు స్వ్కాడ్ అధికారులు హైదరాబాద్ కు వచ్చి ఉన్నతాధికారులతో కలిసి దాడులు చేయటంతో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఒకవేళ భోపాల్ నుండి పోలీసు అధికారులు రాకపోయుంటే నగరంలో ఎలాంటి విధ్వంసాలు జరిగుండేవో అంచనా వేయలేకపోతున్నారు. ఎంతమంది ప్రముఖులను, ఎన్ని షాపింగ్ మాల్స్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారనే విషయాలను తెలుసుకుంటున్నారు. దాంతో ఇటు ప్రముఖుల్లోను అటు షాపింగ్ మాల్స్ యాజమాన్యాల్లోను టెన్షన్ పెరిగిపోతోంది. ఉగ్రవాదుల చర్యలంటే అవి ప్రముఖులు, షాపింగ్ మాల్స్ కు మాత్రమే పరిమితమవుతాయా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: