ఉత్తరాంధ్ర : ఇద్దరి మధ్యా వ్యక్తిగత వైరం పెరిగిపోయిందా ?

Vijaya


రాబోయే ఎన్నికలు అధికార, ప్రతిపక్షాల్లోని చాలామంది నేతలకు జీవన్మరణ సమస్యగా  తయారైంది. కచ్చితంగా రెండోసారి అధికారంలోకి రావాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో వచ్చేఎన్నికల్లో గెలవకపోతే టీడీపీ తెరమరుగైపోవటం ఖాయమని చంద్రబాబునాయుడుకు బాగా తెలుసు. టీడీపీ గెలిస్తే వ్యక్తిగా జగన్ కు ఊహించలేని సమస్యలు చుట్టముట్టడం ఖాయం. అలాగే వైసీపీ గెలిస్తే టీడీపీతో పాటు చాలామంది తమ్ముళ్ళ రాజకీయ జీవితానికి ముగింపు కార్డు పడటం ఖాయం.



ఇలాంటి అనేక నియోజకవర్గాల్లో  శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గం కూడా ఒకటి. 2019 ఎన్నికల్లో తమ్మినేని సీతారాం గెలిచి అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన కూర రవికుమార్ స్పీకర్ కు స్వయాన బావమరిదే. అయితే బావ-బావమరిది మధ్య రక్తసంబంధంకన్నా రాజకీయ వైరమే విపరీతంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి పరిస్ధితుల ప్రకారం చూస్తే  వచ్చేఎన్నికల్లో టీడీపీ గెలవాల్సిన అవసరం కూనకు చాలా ఎక్కువుంది.



వైసీపీనే మళ్ళీ గెలిస్తే కూన రాజకీయజీవితం దాదాపు ముగిసినట్లే అనుకోవాలి. ఎందుకంటే కూనకు దూకుడు, నోటిదురుసు చాలా ఎక్కువ. అధికారులపై నోరు, చేయి చేసుకుంటున్న కారణంగా కేసులను ఎదుర్కొని కొన్నిసార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అయినా పద్దతి మార్చుకోవటంలేదు. తనపైన కేసులు పడి జైలుకు వెళ్ళటానికి బావ తమ్మినేనే కారణం అనే మంట కూనలో బాగా పెరిగిపోతోంది.



టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బావను దెబ్బకు దెబ్బ తీయాలనే కసి కూనలో పెరిగిపోతోంది. ఇద్దరి మధ్య రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత వైరంగా మారిపోయింది. దాంతో ఆరోసారి గెలవాలని తమ్మినేని ప్రయత్నాలు చేస్తున్నారు. రెండోసారి గెలిచి తమ్మినేనిని కోలుకునే అవకాశం లేకుండా దెబ్బతీయాలని కూన గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కూన ప్రయత్నాలు ఫలించాలంటే ముందు టీడీపీ అధికారంలోకి రావాలి. ఇదే సందర్భంలో స్పీకర్ కు గెలుపు అంత వీజీ కాదనే ప్రచారం జరుగుతోంది. సంక్షేమ పథకాలే పార్టీతో పాటు తనను కూడా గెలిపిస్తుందని తమ్మినేని గట్టి విశ్వాసంతో ఉన్నారు. చిరవకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: