హైదరాబాద్ : తెలంగాణాలో దిక్కులేదు కానీ...

Vijaya



తెలంగాణా మంత్రి కేటీయార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఇపుడు ప్రైవేటీకరణ చేయబోవటంలేదని ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే వైజాగ్లో ప్రకటించారు. కేంద్రమంత్రి అలా ప్రకటించారో లేదో వెంటనే కేటీయార్, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ దెబ్బకు వైజాగ్ స్టీల్స్ విషయంలో నరేంద్రమోడీ ప్రభుత్వం వెనకడుగు వేసిందని ప్రకటించేసుకున్నారు. తాము ఏపీలోకి ఇంకా అడుగుపెట్టకుండానే సాధించిన తొలివిజయంగా గోలగోల చేసేస్తున్నారు.



బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ ఏ స్ధాయిలో ఉందంటే తొందరలోనే  వైజాగ్ లో విజయోత్సవ సభ నిర్వహించబోతున్నట్లు తోట ప్రకటించేంతగా. నిజానికి కేంద్రమంత్రి చేసిన ప్రకటనకు కేటీయార్ క్లైమ్ చేసుకోవటానికి ఎలాంటి సంబంధంలేదు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలోతాము కూడా పాల్గొంటామని కేటీయార్ చెప్పారంతే. అయితే స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం ఇపుడు అమ్మటంలేదు, తెలంగాణా ప్రభుత్వం కొనేదిలేదు. కేవలం రు. 5 వేల కోట్ల మైన్ టెన్స్+రా మెటీరియల్ సప్లై+కొంత టెక్నికల్ అసిస్టెన్స్ కోసం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) ఉన్న వాళ్ళు బిడ్లలో పాల్గొనచ్చని ఆహ్వానించింది.



ఈవోఐలో తెలంగాణా ప్రభుత్వం తరపున సింగరేణి కాలరీస్ పాల్గొంటున్నదంతే. ఈవోఐలో పాల్గొనటమంటే స్టీల్ ఫ్యాక్టరీని కొనేయటంకాదు. నిజంగానే కేంద్రం అమ్మినా స్టీల్ ఫ్యాక్టరీని కొనేంత సీన్ తెలంగాణా ప్రభుత్వానికి లేదు. వాస్తవం ఇలాగుంటే తెలంగాణా దెబ్బకు కేంద్రం వెనకడుగు వేసిందని కేటీయార్, తోట గోల చేసేస్తున్నారు.



ఇదే నిజమైతే అధికారంలోకి రాగానే 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని కేసీయార్ ఇచ్చిన హామీ ఏమైంది ? అజంజాహీ పేపర్ మిల్స్ కు పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పిన మాటేమైంది ? అంతెందుకు సింగరేణి బొగ్గుగనులను మోడీ ప్రైవేటుపరం చేస్తున్నారంటు గోల చేస్తున్నారుకదా. సింగరేణి బొగ్గుగనులు ప్రైవేటుపరం కాకుండా ఎందుకు ఆపలేకపోతున్నారు ? ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేటాయించిన రైల్వే వ్యాగన్ వర్క్ షాపు మహారాష్ట్రకు తరలిపోతే అడ్డుకోలేకపోయారు. తెలంగాణాను చక్కదిద్దుకునేంత సీన్ లేని ప్రభుత్వం వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణను అడ్డుకున్నట్లు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: